- District News
- విద్యార్థుల సంక్షేమమే లక్ష్యం.. బీసీ హాస్టల్కు సర్పంచ్ టోనీ చేయూత
విద్యార్థుల సంక్షేమమే లక్ష్యం.. బీసీ హాస్టల్కు సర్పంచ్ టోనీ చేయూత
గ్రామాభివృద్ధితో పాటు విద్య, క్రీడలకు ప్రాధాన్యం.. సింగరేణి ప్రజల మన్ననలు పొందుతున్న సర్పంచ్ మేదరి వీరప్రతాప్ (టోనీ)
మంగళవారం సింగరేణి (కారేపల్లి)లోని బీసీ హాస్టల్ను సందర్శించిన సర్పంచ్ టోనీ, విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు. విద్యార్థుల అభ్యర్థన మేరకు వెంటనే వాలీబాల్ను అందజేసి క్రీడల పట్ల వారిలో మరింత ఆసక్తిని పెంపొందించారు. అలాగే త్వరలో క్యారం బోర్డు, చెస్ వంటి ఇండోర్ గేమ్స్ సామగ్రిని కూడా అందజేస్తానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా సర్పంచ్ టోనీ మాట్లాడుతూ, "విద్యార్థులు చదువులోనే కాకుండా క్రీడల్లోనూ రాణించాలి. శారీరక దారుఢ్యం, మానసిక వికాసం కోసం క్రీడలు ఎంతో అవసరం. గ్రామపంచాయతీ తరఫున విద్యార్థులకు అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తాం. వారి భవిష్యత్తు బంగారు బాటలో నడవడానికి అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తాను" అని తెలిపారు.
గ్రామ ప్రజల సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంలో సర్పంచ్ టోనీ ముందుంటున్నారని స్థానికులు అభినందిస్తున్నారు. విద్యార్థుల పట్ల చూపుతున్న శ్రద్ధ, విద్యతో పాటు క్రీడలకు ఇస్తున్న ప్రోత్సాహం గ్రామ యువతకు ఆదర్శంగా నిలుస్తోందని పలువురు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి జ్యోతి, హాస్టల్ వార్డెన్ ప్రకాశ్, విద్యార్థులు పాల్గొన్నారు. గ్రామాభివృద్ధి, విద్య, క్రీడల సమన్వయంతో సింగరేణిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సర్పంచ్ టోనీ పనిచేస్తున్నారని గ్రామస్థులు కొనియాడారు.
