- District News
- ఎల్నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి
ఎల్నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి
అప్పాయిగూడెం రైతు వేదికలో విత్తన మేళా విజయవంతం – రైతులకు విలువైన సూచనలు
ఖమ్మం జిల్లా, కారేపల్లి (సింగరేణి ) :లోకల్ గైడ్, జూలై 27:
సింగరేణి మండలంలోని అప్పాయిగూడెం గ్రామ రైతు వేదికలో సోమవారం నిర్వహించిన విత్తన మేళా కార్యక్రమం విజయవంతంగా జరిగింది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రైతులకు నాణ్యమైన విత్తనాల ఎంపిక, విత్తన శుద్ధి, విత్తన నిల్వ పద్ధతులు, పంటలకు అనువైన విత్తనాల వినియోగంపై వ్యవసాయ అధికారులు సమగ్ర అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున నీటిని పొదుపుగా వినియోగించాలని, తక్కువ నీటితో సాగయ్యే పంటలను ఎంపిక చేసుకోవాలని, వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వ్యవసాయ శాఖ సూచనలను పాటించాలని తెలిపారు. అలాగే విత్తనాలను ధృవీకరించిన కేంద్రాల నుంచే కొనుగోలు చేయాలని, విత్తన శుద్ధి తప్పనిసరిగా చేపట్టాలని, నేల పరీక్షలు చేయించుకుని ఎరువుల వినియోగాన్ని శాస్త్రీయ పద్ధతిలో చేపట్టాలని సూచించారు.
అధిక దిగుబడులు సాధించేందుకు ఆధునిక సాగు విధానాలు, పంటల సంరక్షణ, పురుగులు–తెగుళ్ల నివారణ చర్యలు, నీటి యాజమాన్య పద్ధతులు, ప్రభుత్వ వ్యవసాయ సంక్షేమ పథకాలపై అధికారులు రైతులకు విస్తృతంగా వివరించారు. రైతులు ఉత్సాహంగా పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
గ్రామంలో రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న సర్పంచ్ దండు ప్రవీణ్ ఆధ్వర్యంలో రైతులకు అవసరమైన అవగాహన కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తున్నారు. గ్రామంలో రహదారుల అభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సౌకర్యాల మెరుగుదల, పచ్చదనం పెంపు, రైతు వేదికలో శిక్షణా కార్యక్రమాల నిర్వహణ వంటి అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తూ అప్పాయిగూడెంను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని గ్రామస్తులు అభినందించారు.
రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు ఎల్నినో ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేలా శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తూ, ప్రతి రైతుకు అవసరమైన సహకారం అందించేందుకు గ్రామపంచాయతీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని సర్పంచ్ దండు ప్రవీణ్ తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
