భద్రాచలంలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల పట్టాభిషేకం
భద్రాచలం, మార్చి 28: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పట్టాభిషేక మహోత్సవం శనివారం భక్తుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పవిత్ర వేడుకను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా, వారి సతీమణి శ్రీమతి జానకి శుక్లా దంపతులు తిలకించి, స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
ఈ మహోత్సవానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ బలరాం నాయక్, భద్రాచలం ఎమ్మెల్యే డా. తెల్లం వెంకట్రావు, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిషోర్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు తదితరులు హాజరయ్యారు.
భద్రాచలం పర్యటనకు తొలిసారిగా విచ్చేసిన గవర్నర్ దంపతులకు ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ హెలీప్యాడ్ వద్ద మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే వెంకట్రావు, కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజు శాలువాలు, పుష్పగుచ్ఛాలతో స్వాగతం తెలిపారు.
ఈ సందర్భంగా గవర్నర్ భద్రాచలంలో ఐటిడిఎ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘భద్రగిరి మార్ట్’ను ప్రారంభించారు. మార్ట్లో గిరిజనులు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించిన గవర్నర్ దంపతులు, వాటి వివరాలను ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి బి. రాహుల్, సహాయ ప్రాజెక్ట్ అధికారి డేవిడ్ల నుంచి తెలుసుకున్నారు. అనంతరం పలు గిరిజన ఉత్పత్తులను కొనుగోలు చేశారు.
ఈ వేడుకలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని, శ్రీ సీతారాముల దివ్య దర్శనం పొందారు.
