- District News
- Khammam
- పౌష్టికాహారానికి తొలి అడుగు..
పౌష్టికాహారానికి తొలి అడుగు..
గేట్ కారేపల్లి అంగన్వాడీ కేంద్రంలో చిన్నారికి ఘనంగా అన్నప్రాసన
ఖమ్మం జిల్లా,కారేపల్లి (సింగరేణి ) : లోకల్ గైడ్, ఆగష్టు 7 : గేట్ కారేపల్లి అంగన్వాడీ కేంద్రంలో వెలుగు స్వప్న–సురేష్ దంపతుల కుమారుడి అన్నప్రాసన వేడుకను ఘనంగా నిర్వహించారు. గేట్ కారేపల్లి సర్పంచ్ పూసం ఎల్లయ్య చేతుల మీదుగా చిన్నారికి అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించి, చిన్నారిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో సందడి వాతావరణం నెలకొంది.
చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తొలి దశ నుంచే పౌష్టికాహారం అందించడం ఎంతో ముఖ్యమని సర్పంచ్ పూసం ఎల్లయ్య తెలిపారు. ఆరు నెలల వయస్సు పూర్తయిన అనంతరం తల్లిపాలతో పాటు వయస్సుకు అనుగుణంగా పౌష్టిక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని సూచించారు. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు సమతుల్య ఆహారం, పరిశుభ్రత, ఆరోగ్య సంరక్షణ ఎంతో అవసరమన్నారు.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు ప్రభుత్వం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పిల్లల బరువు, ఎదుగుదల, ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన పోషకాహారం అందించడంలో అంగన్వాడీ సిబ్బంది చేస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కె. అనూష, పాలకవర్గ సభ్యులు భూక్యా రమేష్, మూడు శ్రీను పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. అంగన్వాడీ టీచర్లు ఇల్లంగి విజయకుమారి, భూక్యా లక్ష్మి, సోమందుల నాగమణి, ఆయాలు భూక్యా నందిని, సైయాద్. మహిముద కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
అలాగే గర్భిణీ స్త్రీలు, చిన్నారుల తల్లులు పాల్గొని అన్నప్రాసన వేడుకను తిలకించారు. ఈ సందర్భంగా చిన్నారికి ఆరోగ్యం, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో కూడిన భవిష్యత్తు కలగాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులు, అంగన్వాడీ సిబ్బంది ఆశీర్వాదాలు అందించారు. చిన్నారుల ఆరోగ్యం, పోషణపై తల్లులకు పలు సూచనలు చేసి అవగాహన కల్పించారు.
