- District News
- Nizamabad
- జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం...
జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం...
ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
లోకల్ గైడ్ నిజామాబాదు జిల్లా ప్రతినిధి, ఆగష్టు 13:
నిజామాబాదు జిల్లా 44 వ జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో గురువారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు .
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి శివారులోని గోవింద్పేట్ వంతెన వద్ద 44వ జాతీయ రహదారి పై బస్సును వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొంది. కొందరు ప్రయాణికులు మహారాష్ట్ర నాందేడ్ కిన్వట్ నుండి హైదరాబాద్లోని ముశ్చింతల్ తీర్థయాత్రకు రెండు బస్సులతో బయలుదేరారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 44 నెంబర్ జాతీయ రహదారిపై బ్రిడ్జి వద్ద బస్సు టైర్ పంచర్ కావడంతో రెండు బస్సులు హైవేపై నిలిచిపోయాయి.
అయితే కొందరు ప్రయాణికులు డివైడర్పై కూర్చుని సేద దీరుతున్నారు. రహదారిపై ఆగి ఉన్న బస్సును వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. దీంతో ప్రయాణికులతో నిండి ఉన్న బస్సు ముందుకు కదలి డివైడర్ ప్రాంతంలో కూర్చున్న ప్రయాణికుల మీదికి దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు మహిళలు సుజాత, మాధవి అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న నిజామాబాదు పోలీస్ కమీషనర్ సాయిచైతన్య హుటాహుటిన చేరుకొని ఘటనాస్థలాన్ని పరిశీలించారు. రోడ్డు ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్హెచ్వో సత్యనారాయణ గౌడ్ తదితరులు సీపీ వెంట ఉన్నారు.
