వ్యాధుల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి: డీఎంహెచ్‌వో డా. సీహెచ్. ధనరాజ్

టోర్నాల వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో ఆకస్మిక తనిఖీ – విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు, సీజనల్ వ్యాధులపై అవగాహన

Published On
వ్యాధుల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి: డీఎంహెచ్‌వో డా. సీహెచ్. ధనరాజ్

సిద్దిపేట, ఆగస్టు 6(లోకల్ గైడ్):

వర్షాకాలంలో ప్రబలే డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు వంటి సీజనల్ వ్యాధుల నివారణకు ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు పాటించాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌వో) డా. సీహెచ్. ధనరాజ్ సూచించారు.గురువారం సిద్దిపేట రూరల్ మండలం టోర్నాలలోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఎపిడెమియాలజిస్ట్, ర్యాపిడ్ రెస్పాన్స్ టీం (ఆర్‌ఆర్‌టీ), నారాయణరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి, ఆరోగ్య సిబ్బందితో కలిసి కళాశాల ఆవరణ, హాస్టల్, తరగతి గదులు, వంటగదిని పరిశీలించి పరిశుభ్రతను నిరంతరం పాటించాలని సూచించారు.ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి సీజనల్ వ్యాధుల నివారణ చర్యలు, వ్యక్తిగత పరిశుభ్రత, దోమల నివారణపై అవగాహన కల్పించారు. ఫైలేరియా సిబ్బంది దోమల నివారణ స్ప్రేయింగ్ నిర్వహించగా, వైద్య బృందం విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు, హీమోగ్లోబిన్ (హెచ్‌బీ) పరీక్షలు నిర్వహించింది. పరీక్షల్లో జ్వరం లక్షణాలతో ఎవరూ గుర్తించబడలేదని అధికారులు తెలిపారు.కళాశాల ప్రిన్సిపాల్ సంతోష్ కుమార్‌కు డీఎంహెచ్‌వో పలు సూచనలు చేస్తూ, ఏ విద్యార్థికైనా జ్వరం లేదా ఇతర ఆరోగ్య సమస్యలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ మంజుల, ఎపిడెమియాలజిస్ట్ సోఫాన్, ఎస్‌యూఓ చక్రధర్, హెచ్‌ఈ సరస్వతి, జిల్లా కార్యాలయ సూపరింటెండెంట్ శ్రీధర్, హెచ్‌ఎస్ భాస్కర్, ఫైలేరియా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News