- District News
- సల్బత్తాపూర్లో తాగునీటి కష్టాలు.. బిందెలతో గ్రామస్తుల నిరసన.
సల్బత్తాపూర్లో తాగునీటి కష్టాలు.. బిందెలతో గ్రామస్తుల నిరసన.
40 ఏళ్లుగా సమస్య.. పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు.
లోకల్ గైడ్ /బంట్వారం
వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం సల్బత్తాపూర్ గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు శనివారం ఖాళీ బిందెలతో రోడ్డుపై నిరసన చేపట్టారు. గత 2, 3 రోజులుగా మిషన్ భగీరథ నీరు సరఫరా కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గత 40 ఏళ్లుగా గ్రామంలో తాగునీటి సమస్య కొనసాగుతున్నప్పటికీ శాశ్వత పరిష్కారం చూపడం లేదని గ్రామస్తులు తెలిపారు. సమస్యపై గతంలో జిల్లా కలెక్టర్కు ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించినా, ఇప్పటివరకు తాగునీటి పైప్లైన్ కోసం నిధులు మంజూరు కాలేదని ఆరోపించారు. గత నాలుగు నెలలుగా అధికారులకు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఎన్నికల సమయంలో గ్రామంలో ప్రచారం నిర్వహించిన సందర్భంగా తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, ఎన్నికలు జరిగి సుమారు 32 నెలలు గడుస్తున్నా సమస్య పరిష్కారం కాలేదని గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామ యువ నాయకుడు కావలి నర్సిములు మాట్లాడుతూ తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించకపోతే మానవ హక్కుల సంఘం, జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. సమస్య పరిష్కారం కాకపోతే మహిళలతో కలిసి అసెంబ్లీ ముట్టడి, వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి చేపడతామని గ్రామస్తులు హెచ్చరించారు.
