- District News
- చర్లలో కొమురం భీమ్ విగ్రహావిష్కరణ
చర్లలో కొమురం భీమ్ విగ్రహావిష్కరణ
ఆదివాసీ హక్కులు, ఆత్మగౌరవం, సంస్కృతిని కాపాడుకోవాలి

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా భద్రాద్రి జిల్లా, చర్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కొమురం భీమ్ విగ్రహాన్ని భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ సభ్యులు, శాశ్వత ఆహ్వానితులు పొదెం వీరయ్య ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పొదెం వీరయ్య మాట్లాడుతూ ఆదివాసీ సమాజం యొక్క నిష్కల్మషమైన మనస్తత్వం, స్వచ్ఛమైన సంప్రదాయాలు, సంస్కృతి, ఆత్మీయత, మంచితనం దేశానికి గొప్ప ఆదర్శమని అన్నారు. ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని చర్ల మండలంలోని ఆదివాసీ ప్రజలు మేళతాళాలు, సంప్రదాయ నృత్యాలతో పొదెం వీరయ్యకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమం ఆదివాసీ సంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబించేలా ఉత్సాహంగా సాగింది. కొమురం భీమ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఆదివాసీ నాయకులు, సంఘాల ప్రతినిధులు, నిర్వాహకులను పొదెం వీరయ్య ప్రత్యేకంగా అభినందించారు. కొమురం భీమ్ ఆశయాలు, పోరాట స్ఫూర్తి ఆదివాసీ యువతకు ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చర్ల మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఆదివాసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ఆదివాసీ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
