- District News
- తండ్రిని హత్య చేసి మిస్సింగ్ కేసుగా చిత్రీకరణ....
తండ్రిని హత్య చేసి మిస్సింగ్ కేసుగా చిత్రీకరణ....
పథకం ప్రకారం గొంతు నులిమి హత్య..
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)
కన్న తండ్రిని పథకం ప్రకారం హత్య చేసి,అనంతరం మిస్సింగ్ కేసుగా చిత్రీకరించిన కుమారుడు భీమిని ఉదయ్ ను అరెస్ట్ చేసినట్లు జైపూర్ సిఐ నవీన్ కుమార్ తెలిపారు.సిఐ వివరాల ప్రకారం ఉదయ్ ప్రేమ వివాహం చేసుకోవడం అతని తండ్రి లక్ష్మణ్కు ఇష్టం లేకపోవడంతో తరచు కుమారుడిని,అతని భార్యను దూషిస్తు ఇబ్బందులకు గురిచేసేవాడు.దీంతో అతను కిష్టంపేట నుండి భీమారంలోని తన అమ్మమ్మ ఇంటికి వచ్చి ఉంటున్నాడు.2025 జూలై 21న లక్ష్మణ్ భీమారంలోని అమ్మమ్మ ఇంటికి వచ్చి కోడలితో గొడవకు దిగడంతో ముందుగా వేసుకున్న పథకం ప్రకారం తన తండ్రిని బైక్పై భీమారం శివారులోని గొల్లవాగు ప్రాజెక్టు ప్రాంతానికి తీసుకెళ్లాడు,అక్కడ తండ్రి లక్ష్మణ్ గొంతు నులిమి హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని చెట్ల పొదల్లో పడవేసి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు విచారణలో వెల్లడైందని తెలిపారు.అనంతరం ఏమీ తెలియనట్లు ఇంటికి వెళ్లి,తండ్రి కనిపించడం లేదంటు కుటుంబ సభ్యులతో కలిసి వెతికినట్లు పోలీసులు తెలిపారు.ఆ తర్వాత చెన్నూరు పోలీస్స్టేషన్లో లక్ష్మణ్ అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేయించి మిస్సింగ్ కేసు నమోదు చేయించినట్లు పేర్కొన్నారు.జులై 30న గొల్లవాగు అటవీ ప్రాంతంలో మృతదేహం లభించగా,దుస్తులు,చెప్పులు తదితర ఆనవాళ్ల ఆధారంగా కుటుంబ సభ్యులు లక్ష్మణ్ మృతదేహంగా గుర్తించారు.ఈనెల11న భీమారం పోలీస్స్టేషన్లో ఉదయ్ను విచారించగా హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించినట్లు సిఐ తెలిపారు.ఈ మేరకు నిందితునిపై హత్య కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు సిఐ తెలిపారు.ఈ సమావేశంలో ఎస్ఐ రాజేందర్ సిబ్బంది పాల్గొన్నారు.
