- District News
- Khammam
- గేట్ కారేపల్లిలో ఘనంగా 80వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
గేట్ కారేపల్లిలో ఘనంగా 80వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
దేశభక్తి చాటుతూ జాతీయ జెండాకు ఘన నివాళి
ఖమ్మం జిల్లా, కారేపల్లి (సింగరేణి ) : లోకల్ గైడ్, ఆగష్టు 15 : గేట్ కారేపల్లి గ్రామపంచాయతీ పరిధిలో 80వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పూసం ఎల్లయ్య ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి కె. అనూష సమన్వయంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా యువ నాయకులు గుడిపూడి తిరుమల రావు ముఖ్య అతిథిగా హాజరై వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం దేశ స్వాతంత్ర్యం, రాజ్యాంగ నిర్మాణం, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతంలో రాజ్యాంగం అందించిన హక్కులు, బాధ్యతల గురించి కార్యక్రమంలో పాల్గొన్న వారికి వివరించారు. దేశం కోసం త్యాగాలు చేసిన స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించారు.
సర్పంచ్ పూసం ఎల్లయ్య మాట్లాడుతూ.. గ్రామ ప్రజల ఐక్యతతోనే పంచాయతీ మరింత అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, పారిశుధ్యం, విద్య, తాగునీరు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. యువత దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ జిల్లా యువ నాయకులు గుడిపూడి తిరుమల రావు మాట్లాడుతూ.. దేశ ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుతూ ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రజల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు రావాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో గేట్ కారేపల్లి ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పంచాయతీ ఉపసర్పంచ్ కందుల శ్రీనివాసరావు (సామెల్), పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. గ్రామ మహిళలు, యువత, గ్రామస్తులు అధిక సంఖ్యలో హాజరై జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రామంలో దేశభక్తి వాతావరణం నెలకొంది. జాతీయ జెండా రెపరెపల మధ్య నిర్వహించిన వేడుకలు గ్రామస్తుల్లో దేశభక్తి, ఐక్యతా భావాన్ని మరింత పెంపొందించాయి.
