- District News
- Khammam
- రాజకీయాలకు అతీతంగా రాఖీ బంధం
రాజకీయాలకు అతీతంగా రాఖీ బంధం
ఎమ్మెల్యే రాందాస్ నాయక్కు రాఖీ కట్టిన మహిళా నాయకులు.. అక్కాచెల్లెళ్లకు అండగా ఉంటానని హామీ
వైరా : లోకల్ గైడ్ న్యూస్, ఆగష్టు 28 :
రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని వైరా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు వీరంశెట్టి సీతారాములు సతీమణి భవానితో పాటు మహిళా సర్పంచులు భూక్య అనిత బాలు, భూక్య సునీత రామ్లా నాయక్, వైరా మండల బీజేపీ మహిళా నాయకులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్కు రాఖీ కట్టి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ.. రాఖీ పౌర్ణమి కేవలం పండుగ మాత్రమే కాదని, అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, నమ్మకం, రక్షణకు ప్రతీకగా నిలిచే పవిత్రమైన బంధమని అన్నారు. రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా అందరూ కుటుంబ సభ్యుల్లా, సోదరభావంతో మెలగడం భారతీయ సంస్కృతిలోని గొప్పతనమని పేర్కొన్నారు. రాఖీ బంధం రాజకీయాలకు అతీతమైన ఆత్మీయతను చాటుతుందని, మహిళా నాయకులు తనపై చూపిన ప్రేమాభిమానాలు తనకు ఎంతో ఆనందాన్ని కలిగించాయని ఎమ్మెల్యే తెలిపారు. వైరా నియోజకవర్గంలోని ప్రతి అక్కాచెల్లెమ్మకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని, వారి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాఖీ కట్టిన మహిళా నాయకులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వైరా నియోజకవర్గ ప్రజలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు.
