- District News
- Khammam
- సర్వాయి పాపన్న ఆశయాలే బహుజనుల ఆత్మగౌరవానికి మార్గదర్శకం
సర్వాయి పాపన్న ఆశయాలే బహుజనుల ఆత్మగౌరవానికి మార్గదర్శకం
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ ఘన నివాళి
ఖమ్మం , ఆగస్టు 18 (లోకల్ గైడ్ ) :
బహుజన వీరయోధుడు, మొఘల్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు బావుటా ఎగరేసిన విప్లవమూర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ ఘనంగా నివాళులర్పించారు. సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన త్యాగాలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా నూతి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ.. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక అని కొనియాడారు. ఆయన పోరాట స్ఫూర్తి తరతరాలకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. సామాన్య కుటుంబంలో జన్మించిన పాపన్న.. సమాజంలో నెలకొన్న అన్యాయాలు, అసమానతలను ఎదిరించి స్వయంశక్తితో సైన్యాన్ని నిర్మించిన మహా ధీరుడని పేర్కొన్నారు.
మొఘల్ సామ్రాజ్య దౌర్జన్యాలకు ఎదురొడ్డి ఖిలాషాపూర్ కోటను నిర్మించి, గోల్కొండ కోటపై జెండా ఎగరేసిన తెలంగాణ వీరుడు సర్వాయి పాపన్న అని గుర్తుచేశారు. అన్ని వర్గాల ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చి సమసమాజ స్థాపన కోసం ప్రజాపాలన అందించేందుకు కృషి చేసిన గొప్ప దార్శనికుడని ప్రశంసించారు.
కులమతాలకు అతీతంగా పేదలు, పీడిత వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించేందుకు పాపన్న చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. బహుజనుల హక్కులు, ఆత్మగౌరవం కోసం ప్రాణాలర్పించిన సర్వాయి పాపన్న గౌడ్ చరిత్రను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్పష్టం చేశారు.
పాపన్న చూపిన పోరాట మార్గం నేటి ప్రజాస్వామ్య వ్యవస్థలో అణగారిన వర్గాల హక్కుల సాధనకు మార్గదర్శకమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. సర్వాయి పాపన్న ఆశయాలకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వం పేదలు, బహుజనుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తోందన్నారు.
నేటి యువత సర్వాయి పాపన్న ధైర్యసాహసాలు, నాయకత్వ పటిమను స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో నెలకొన్న అసమానతలపై ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడాలని పిలుపునిచ్చారు. పాపన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం ద్వారా ఆయన చేసిన త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సర్వాయి పాపన్న ఆశయాలు, పోరాట స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలని నూతి సత్యనారాయణ గౌడ్ కోరారు. సర్వాయి పాపన్న స్మృతిని చిరస్థాయిగా నిలబెట్టేందుకు ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
