- District News
- Khammam
- ఏకలవ్య పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. విద్యార్థులతో ముఖాముఖి
ఏకలవ్య పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. విద్యార్థులతో ముఖాముఖి
చదువుతోనే పేదరికంపై విజయం.. క్రమశిక్షణతో లక్ష్య సాధన విద్యార్థుల భోజన నాణ్యతలో రాజీ వద్దు : కలెక్టర్ దివాకర టీఎస్
ఖమ్మం జిల్లా, కారేపల్లి : ఆగస్టు 18 ( లోకల్ గైడ్ ) :
కారేపల్లి మండలం రేలకాయలపల్లిలోని ఏకల
వ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందస్తు సమాచారం లేకుండా పాఠశాలను సందర్శించిన కలెక్టర్.. పాఠశాలలోని విద్యా ప్రమాణాలు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, మౌలిక వసతులు, వంటశాల నిర్వహణ, భోజన నాణ్యత తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ తరగతి గదులను సందర్శించి విద్యార్థులకు అందుతున్న విద్యాబోధన తీరును పరిశీలించారు. విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడి వారి చదువు, లక్ష్యాలు, పాఠశాలలో అందుతున్న సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. చదువుతోనే పేదరికంపై విజయం సాధించవచ్చని, క్రమశిక్షణతో ముందుకు సాగితే అనుకున్న లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చని కలెక్టర్ విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.
అనంతరం పాఠశాల వంటశాలను పరిశీలించిన కలెక్టర్ విద్యార్థులకు తయారు చేస్తున్న ఆహార పదార్థాలు, వంటశాల పరిశుభ్రత, భోజన నాణ్యత, మెనూ అమలు తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థులకు అందించే భోజనం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడవద్దని పాఠశాల ప్రిన్సిపాల్ ప్రశాంత్ కుమార్కు స్పష్టం చేశారు. నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
పాఠశాల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన ప్రిన్సిపాల్
పాఠశాల ప్రిన్సిపాల్ ప్రశాంత్ కుమార్ పాఠశాలకు సంబంధించిన పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. చీమలపాడు నుంచి పాఠశాల వరకు వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, చీమలపాడు నుంచి నడిచే బస్సు సర్వీసును పాఠశాల వరకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టడంతో పాటు విద్యార్థులకు మరింత మెరుగైన వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ద్వారా కోరారు.
కలెక్టర్ ఆకస్మిక తనిఖీతో పాఠశాల సిబ్బందిలో అప్రమత్తత నెలకొంది. విద్యార్థుల విద్య, సంక్షేమం, భద్రత, ఆహార నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఈ తనిఖీలో మండల తహసీల్దార్ ఓరుగంటి వెంకటేశ్వర్లు, ఆర్ఐ జగదీశ్, వివిధ శాఖల అధికారులు, పాఠశాల ప్రిన్సిపాల్ ప్రశాంత్ కుమార్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
