- District News
- Khammam
- మాదారంలో మురిసిన గిరిజన సంస్కృతి.. ఘనంగా తీజ్ వేడుకలు!
మాదారంలో మురిసిన గిరిజన సంస్కృతి.. ఘనంగా తీజ్ వేడుకలు!
మాజీ సర్పంచ్ అజ్మీరా నరేష్ కుమార్ ఆధ్వర్యంలో వేడుకలు
ఖమ్మం జిల్లా, కారేపల్లి : ఆగష్టు 17 (లోకల్ గైడ్ ) :
గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే తీజ్ వేడుకలు సింగరేణి మండలం మాదారం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. మాదారం మాజీ సర్పంచ్ అజ్మీరా నరేష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మిషన్ వాక్ ఫౌండేషన్ ఫౌండర్ డాక్టర్ బాదావత్ రవి, ఆయన మిత్రుడు, ఆర్మీ సోల్జర్ దశరథ్ పాల్గొని గిరిజన సంప్రదాయ వేడుకల్లో భాగస్వాములయ్యారు.
గ్రామ పెద్దలు, మహిళలు, యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో మాదారం గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. సంప్రదాయ దుస్తులు, ఆచార వ్యవహారాలతో తీజ్ వేడుకలను అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. గిరిజన సమాజం తరతరాలుగా పాటిస్తున్న ఆచారాలు, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో ఇలాంటి వేడుకలు కీలక పాత్ర పోషిస్తాయని కార్యక్రమంలో పాల్గొన్న వారు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాదావత్ రవి మాట్లాడుతూ గిరిజన సమాజం యొక్క సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలను పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల మధ్య ఐక్యత, సోదరభావాన్ని పెంపొందించేలా ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలను మరింతగా నిర్వహించాలని ఆకాంక్షించారు.
మాజీ సర్పంచ్ అజ్మీరా నరేష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన తీజ్ వేడుకలు సంప్రదాయబద్ధంగా, ఆనందోత్సాహాల మధ్య కొనసాగాయి. ఈ కార్యక్రమంలో మిషన్ వాక్ సభ్యులు డాక్టర్ హాజ్రా, షేర్ ఖాన్, సాయి, నరేష్ రంగ, భద్రు తదితరులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. గిరిజన సంప్రదాయాల పరిరక్షణకు ప్రతీకగా నిలిచిన ఈ వేడుకల్లో గ్రామ పెద్దలు, మహిళలు, యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొనడంతో తీజ్ సంబరాలు కన్నుల పండువగా ముగిశాయి.
