- District News
- Khammam
- మూడు నెలలుగా మిస్టరీ.. టెక్నాలజీతో యువతి ఆచూకీ
మూడు నెలలుగా మిస్టరీ.. టెక్నాలజీతో యువతి ఆచూకీ
ప్రేమ, పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి హైదరాబాద్కు తీసుకెళ్లిన యువకుడు రుకుమ్ అరెస్ట్.. తల్లిదండ్రులకు యువతి అప్పగింత
ఖమ్మం జిల్లా, కారేపల్లి, ఆగష్టు 24 (లోకల్ గైడ్) :
కారేపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో మూడు నెలల క్రితం అదృశ్యమైన యువతి ఆచూకీని కారేపల్లి పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఛేదించారు. యువతి ఆచూకీని గుర్తించి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించడంతో మిస్సింగ్ కేసుకు తెరపడింది. యువతిని ప్రేమ, పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి హైదరాబాద్కు తీసుకెళ్లిన యువకుడు రుకుమ్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కారేపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని భల్లునగర్ తండాకు చెందిన ఓ యువతి అదృశ్యమైనట్లు ఆమె తల్లిదండ్రులు మే నెలలో కారేపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. యువతి వద్ద మొబైల్ ఫోన్ లేకుండా వెళ్లడంతో ఆమె ఆచూకీని గుర్తించడం పోలీసులకు ఇబ్బందిగా మారింది. అయినప్పటికీ పోలీసులు కేసును సవాల్గా తీసుకుని దర్యాప్తు కొనసాగించారు. ఈ క్రమంలో కారేపల్లి ఎస్ఐ బైరు గోపి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి యువతి ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టారు. పలు కోణాల్లో ఆధారాలను సేకరించి విచారణ జరిపిన పోలీసులు చివరకు యువతి జాడను గుర్తించారు. హైదరాబాద్కు చెందిన రుకుమ్ అనే యువకుడు ప్రేమ, పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి యువతిని హైదరాబాద్కు తీసుకెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో తేలినట్లు తెలిపారు. యువతి ఆచూకీ లభించడంతో పోలీసులు సోమవారం ఆమెను సురక్షితంగా కారేపల్లికి తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. యువతిని మాయమాటలతో తీసుకెళ్లిన రుకుమ్పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన అనంతరం రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ బైరు గోపి తెలిపారు. మూడు నెలలుగా కొనసాగుతున్న మిస్సింగ్ కేసును సాంకేతిక పరిజ్ఞానంతో ఛేదించి యువతి ఆచూకీని గుర్తించిన కారేపల్లి పోలీసులను కుటుంబ సభ్యులు అభినందించారు.
