ఖమ్మం వైద్యరంగంలో నవశకం...50 పడకల క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌ ప్రారంభానికి సిద్ధం..

మంత్రి తుమ్మల చేతుల మీదుగా ప్రారంభోత్సవం - రూ.23.75 కోట్లతో అత్యాధునిక భవనాలు మరియు సదుపాయాల కల్పన - కార్పొరేట్‌ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ వైద్యం

తీవ్ర అనారోగ్యంతో బాధపడే వారికి అత్యాధునిక క్రిటికల్‌ కేర్‌ సేవలు హైదరాబాద్‌కు తరలింపు అవసరం తగ్గే అవకాశం మంత్రి తుమ్మల ప్రత్యేక చొరవతో సాకారమైన కీలక ప్రాజెక్టు
Published On
ఖమ్మం వైద్యరంగంలో నవశకం...50 పడకల క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌ ప్రారంభానికి సిద్ధం..

IMG-20260824-WA0293ఖమ్మం:ఆగస్టు,24, లోకల్ గైడ్:

ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజారోగ్య చరిత్రలో మరో కీలక అధ్యాయానికి నాంది పలికేందుకు ఖమ్మం ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి సిద్ధమైంది. ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రి గడప తొక్కే రోగులకు కార్పొరేట్ స్థాయి వైద్యం ప్రభుత్వ ఆసుపత్రిలోనే అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ప్రాంగణంలో నిర్మించిన అత్యాధునిక 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్‌ను రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంగరంగ వైభవంగా ప్రారంభించనున్నారు. తీవ్రమైన అనారోగ్యంతో, ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి చేరుకునే రోగులకు సత్వరమే అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు ఈ సదుపాయం ఎంతో దోహదపడునుంది. ఇది కేవలం ఒక భవన ప్రారంభోత్సవం కాదు... ఖమ్మం జిల్లా ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం వేసిన మరో దృఢమైన అడుగుగా వైద్య వర్గాలు అభివర్ణిస్తున్నాయి. సామాన్యులకు సైతం కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యంగా మంత్రి తుమ్మల వేసిన అడుగులు కృషి నేడు ఫలించింది.

రూ.23.75 కోట్లతో రూపుదిద్దుకున్న అధునాతన నిర్మాణం...

ఈ క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌ ఏర్పాటుకు ప్రభుత్వం రూ.23.75 కోట్ల భారీ పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. 2023 జూన్‌ 7న జారీ అయిన జీవో ఆర్‌టీ నంబర్‌ 311 ద్వారా ఈ అనుమతులు లభించడంతో నిర్మాణ పనులకు వేగం పెరిగింది. రూ.12.66 కోట్ల అంచనా వ్యయంతో టెండర్‌ ప్రక్రియ చేపట్టగా, 2.79 శాతం తక్కువ ధరకే కాంట్రాక్టు ఖరారు కావడం విశేషం. ఇప్పటివరకు నిర్మాణానికి సుమారు రూ.15.27 కోట్లు వెచ్చించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

వైద్య పరికరాలకు రూ.8.48 కోట్లు కేటాయింపు..

మంజూరైన మొత్తం నిధుల్లో నిర్మాణ వ్యయం పోను మిగిలిన రూ.8.48 కోట్లను అత్యాధునిక వైద్య పరికరాల సమకూర్పుకు వినియోగించనున్నారు. దీనితో కేవలం భవనం మాత్రమే కాకుండా, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సాంకేతిక సదుపాయాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఫలితంగా క్రిటికల్‌ కేర్‌ చికిత్సలో నాణ్యత మరింత మెరుగుపడనుంది.

నాలుగంతస్తుల్లో సమగ్ర వైద్య సదుపాయాలు..

నాలుగు అంతస్తుల్లో విశాలంగా నిర్మించిన ఈ క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌లో రోగుల అవసరాలకు అనుగుణంగా వివిధ విభాగాలను ఏర్పాటు చేశారు.
- రెండు ఐసీయూ విభాగాల్లో 20 పడకల చొప్పున 40 పడకలు
- 20 పడకల జనరల్‌ వార్డు
- 5 పడకల డయాలసిస్‌ వార్డు
గుండెపోటు, రోడ్డు ప్రమాదాలు, తీవ్ర శ్వాసకోశ సమస్యలు, మూత్రపిండాల వైఫల్యం తదితర అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు అవసరమైన క్రిటికల్‌ కేర్‌ సేవలను ఒకే చోట అందించే అవకాశం ఏర్పడనుంది.

హైదరాబాద్‌కు తరలింపు అవసరం తగ్గే అవకాశం..

ఇప్పటివరకు తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న రోగులను మెరుగైన క్రిటికల్‌ కేర్‌ కోసం హైదరాబాద్‌ వంటి నగరాలకు తరలించాల్సిన పరిస్థితి ఉండేది. ఈ క్రమంలో ప్రయాణ సమయం కీలకంగా మారేది. తాజాగా ఖమ్మం ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలోనే అత్యాధునిక క్రిటికల్‌ కేర్‌ సేవలు అందుబాటులోకి రానుండటంతో అత్యవసర సమయంలో విలువైన సమయం ఆదా కావడంతో పాటు రోగుల ప్రాణాలను కాపాడే అవకాశాలు మెరుగుపడనున్నాయి. 

నేడు మంత్రి తుమ్మల చేతుల మీదుగా ప్రారంభం..

సుదీర్ఘ నిర్మాణ ప్రక్రియను పూర్తి చేసుకున్న 50 పడకల క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా నేడు లాంఛనంగా ప్రారంభం కానున్న ఈ అత్యాధునిక వైద్య సదుపాయం ఖమ్మం ప్రభుత్వ వైద్య సేవల చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు, ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో మరింత విశ్వాసాన్ని పెంపొందించనుంది.

Tags:

About The Author

Latest News

మూడు నెలలుగా మిస్టరీ.. టెక్నాలజీతో యువతి ఆచూకీ మూడు నెలలుగా మిస్టరీ.. టెక్నాలజీతో యువతి ఆచూకీ
    ఖమ్మం జిల్లా, కారేపల్లి, ఆగష్టు 24 (లోకల్ గైడ్) : కారేపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మూడు నెలల క్రితం అదృశ్యమైన యువతి ఆచూకీని కారేపల్లి పోలీసులు
ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో గ్రామ/వార్డు సభలు నిర్వహించాలి 
ఖమ్మం వైద్యరంగంలో నవశకం...50 పడకల క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌ ప్రారంభానికి సిద్ధం..
రాష్ట్రం లో అన్ని ప్రాంతాలను సమానాభివృద్ది పథంలో  నడిపిస్తోన్నాం.
ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిష్కరించాలి 
సర్పంచ్ పూసం ఎల్లయ్య ఆధ్వర్యంలో గేట్ కారేపల్లిలో ఫాగ్గింగ్
ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం...