- District News
- Ranga Reddy
- సాహితి మణిపూసల పుస్తకం ఆవిష్కరణ పై ప్రత్యేక కథనం.
సాహితి మణిపూసల పుస్తకం ఆవిష్కరణ పై ప్రత్యేక కథనం. .ఉపాధ్యాయుని అక్షర తపస్సు...
విశ్రాంత జీవితంలో అక్షర సేద్యం.. షాద్నగర్ సాహితీ "మణిపూస" మన దయానందం! ఉపాధ్యాయ వృత్తికి వన్నెతెచ్చిన ఆదర్శ మూర్తి.
.
షాద్ నగర్ ఆగస్టు 8, ( లోకల్ గైడ్ ).
వయసు మీద పడుతున్నా ఆయనలోని సాహితీ పిపాసన ఏమాత్రం తగ్గలేదు.... అక్షరాల పట్ల ఆయనకున్న మక్కువ ( పట్టు ) కు వయోభారం ఏ మాత్రం అడ్డుకట్ట కాలేదు.... దశాబ్దాల పాటు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి ఆదర్శ ఉపాధ్యాయుడిగా నిలిచిన కోట్ల దయానందం ఆయన, పదవీ విరమణ పొందిన తర్వాత కూడా తన కలంతో సమాజానికి మేలుకొలుపు కోసం పాటుపడుతున్నారు. తన మదిలో మెదిలిన భావాలను, డైరీల్లో దాచుకున్న అక్షరాలను ఇప్పుడు "సాహితీ మణిపూసలు" గా మన ముందుకు తీసుకువస్తున్నారు షాద్నగర్ గడ్డకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయులు, పద్య కవి కోట్ల దయానందం సార్.
.మొగిలిగిద్ద నుంచి మొదలైన అక్షర ప్రస్థానం...
స్వాతంత్ర్య దినోత్సవం రోజైన 1954 ఆగస్టు 15వ తేదీన కోట్ల లక్ష్మమ్మ, కోట్ల జంగయ్య దంపతులకు జన్మించిన దయానందం బాల్యం అంతా మొగిలిగిద్ద పాఠశాలలోనే సాగింది. ఆ తర్వాత ఉన్నత విద్యాభ్యాసం కోసం షాద్నగర్ చేరుకున్నారు. విద్యార్థి దశ నుంచే తెలుగు భాషపై అమితమైన మక్కువ పెంచుకున్న ఆయన ఉపాధ్యాయుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఎంతో మంది విద్యార్థుల జీవితాల్లో జ్ఞాన దీపాలు వెలిగించారు.
.ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నో సత్కారాలు...
విద్యాబోధనలో ఆయన అంకితభావానికి, నిబద్ధతకు నిదర్శనంగా ఎన్నో పురస్కారాలు ఆయన్ని వరించాయి. 1996లో మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన ఆయన తన ప్రతిభను మరింత మెరుగుపరుచుకుంటూ 1998లో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా సత్కారం (అవార్డు ) అందుకున్నారు. ఉపాధ్యాయుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, విరామ సమయాల్లో పద్య పఠనం, కవితా రచనలపై దృష్టి సారించారు.
.సాహితీ మణిపూసల సృజన.. వెనుకున్న స్ఫూర్తి...
ఉద్యోగ జీవితంలో సుమారు 400కు పైగా అద్భుతమైన పద్యాలు రాసినా, బిడియం వల్లనో మరే ఇతర కారణాల వల్లనో వాటిని ఎప్పుడూ బహిర్గతం చేయలేదు. అయితే, 2025 సెప్టెంబర్ నెలలో షాద్నగర్లో శ్రీ అనంత సాహిత్య సమితి ఆధ్వర్యంలో జరిగిన కవి సమ్మేళనం దయానందం సార్ లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆ సభలో దొరవేటి 'ప్రకృతి పరిమళం' అనే పుస్తకాన్ని చూసి ఆయన అమితంగా స్ఫూర్తి పొందారు. ఆ తర్వాత వాడిచర్ల సత్యం ప్రోత్సాహం, మార్గదర్శకత్వంతో తన కలానికి పదునుపెట్టారు. వయోభారం వెంటాడుతున్నా లెక్కచేయకుండా కేవలం మూడు నెలల రికార్డు సమయంలోనే 250కి పైగా మణిపూసలను రచించి తనలోని అక్షర శక్తిని చాటుకున్నారు.
.మనవరాలి పేరుతోనే తొలి ప్రచురణ...
తన ముద్దుల మనవరాలు "సాహితి" పేరు కలిసి వచ్చేలా ఈ పుస్తకానికి "సాహితీ మణిపూసలు" అని నామకరణం చేయడం ఆయన కుటుంబ అనుబంధానికి, వాత్సల్యానికి అద్దం పడుతోంది. భార్య జయలక్ష్మి గారు, సంతానం వసుంధర, వసంత లక్ష్మి, మాధవీలత కూతుళ్లు కాగా కుమారుడు కోట్ల రాఘవేందర్, కోడలు ప్రశాంతి తదితర కుటుంబ సభ్యుల నిరంతర ( సహకారం ) ప్రోత్సాహంతో ఈ అక్షర యజ్ఞాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు.

అముద్రిత రచనలు ఎన్నో.. వరించిన బిరుదులు...
కేవలం ఈ ఒక్క పుస్తకానికే ఆయన సాహితీ సేవ పరిమితం కాలేదు. ఆయన కలం నుండి జాలువారిన మరో 400కు పైగా పద్యాలు, పిల్లల కోసం ప్రత్యేకంగా రాసిన బాల గేయాలు, సమాజంలో జరుగుతున్న ఎన్నో అంశాలు, ప్రాముఖ్యతపై రచించిన కవితలు, పద్యాలు, పూరణాలు ఇంకా అముద్రితంగానే ఉన్నాయి. సమాజానికి ఆయన అందిస్తున్న ఈ అక్షర సేవను గుర్తించిన సాహితీ లోకం 'మణిపూసల కవిభూషణ!' అనే బిరుదుతో సత్కరించింది. షాద్నగర్ లయన్స్ క్లబ్ వారు 'పద్య కవి'గా ఘనంగా సన్మానించారు.
.యువతకు దయానందం సార్ దిశానిర్దేశం....
నేటి యువతను ఉద్దేశించి ఆయన ఇస్తున్న సందేశం ఎంతో స్ఫూర్తిదాయకం. "యువత మొట్టమొదటగా కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలి. చరిత్రలో ఎంతో మంది గొప్ప మహనీయులు ఉన్నారు, వారి జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలి. వారు చూపిన సన్మార్గంలో పయనిస్తూ, ఉన్నత స్థాయికి చేరుకొని భావి తరాలకు ఆదర్శంగా నిలవాలి" అని దయానందం సార్ పిలుపునిచ్చారు.
