- District News
- Ranga Reddy
- రాజీవ్ గాంధీ ఆశయాలే కాంగ్రెస్కు మార్గదర్శకం
రాజీవ్ గాంధీ ఆశయాలే కాంగ్రెస్కు మార్గదర్శకం
ఆమనగల్లులో ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
న్యూస్ స్టార్ట్
లోకల్ గైడ్
ఆమనగల్లు, ఆగస్టు 20:
మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఆమనగల్లు లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అవ్వారి శివలింగం ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. దేశాన్ని ఆధునిక సాంకేతికత వైపు నడిపించడంలో రాజీవ్ గాంధీ కీలక పాత్ర పోషించారని అన్నారు. ముఖ్యంగా యువతకు అవకాశాలు కల్పించడం, సమాచార సాంకేతిక రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం, దేశ పరిపాలనలో ఆధునిక విధానాలను తీసుకురావడం ద్వారా భవిష్యత్ భారతదేశానికి బలమైన పునాదులు వేశారని కొనియాడారు.
రాజీవ్ గాంధీ కేవలం ఒక మాజీ ప్రధానమంత్రి మాత్రమే కాదని, ఆధునిక భారత నిర్మాణానికి దూరదృష్టితో ఆలోచించిన నాయకుడని అన్నారు. యువత దేశ ప్రగతిలో కీలక పాత్ర పోషించాలని ఆయన కలలు కన్నారని, ఆ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నేటి తరంపై ఉందన్నారు.
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, రాజీవ్ గాంధీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, దేశాభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పత్యా నాయక్, సర్పంచ్ మండ్లి రాములు, కౌన్సిలర్ అనిత శ్రీనివాస్ రెడ్డి, కో-ఆప్షన్ సభ్యుడు అబ్దుల్ ఖాదర్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ గుర్రం కేశవులు, ఆదివాసీ రాష్ట్ర నాయకుడు కృష్ణ నాయక్, సీనియర్ నాయకులు ధనుంజయ, కొండల్ రెడ్డి, కాలే మల్లయ్య, ఖాదర్ ఖాద్రి, గాజుల శ్రీను, గాజుల సురేష్, పూసల సత్యం, అబ్దుల్ అలీమ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వస్పుల శ్రీకాంత్, ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర కార్యదర్శి ఎండి ఫరీద్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. రాజీవ్ గాంధీ ఆశయాల సాధనే నిజమైన నివాళి అని నాయకులు పేర్కొన్నారు.
