- District News
- మృతురాలి రేషన్ కార్డుతో రెండేళ్లుగా బియ్యం స్వాహా? - చనిపోయిన బాలమ్మ పేరుతోనే కార్డు కొనసాగింపు.
మృతురాలి రేషన్ కార్డుతో రెండేళ్లుగా బియ్యం స్వాహా? - చనిపోయిన బాలమ్మ పేరుతోనే కార్డు కొనసాగింపు.
ఇతరులను చేర్చి బియ్యం మాయం చేసినట్లు ఆరోపణ. - ఆన్లైన్లో పరిశీలించడంతో వెలుగులోకి ఘటన.
లోకల్ గైడ్/బంట్వారం
మృతి చెందిన మహిళ రేషన్ కార్డును తొలగించకుండా కొనసాగిస్తూ.. అందులో ఇతరుల పేర్లను చేర్చి రెండేళ్లుగా బియ్యం తీసుకుంటున్నారనే ఆరోపణలు బంట్వారం మండలం సల్బత్తాపూర్ గ్రామంలో కలకలం రేపుతున్నాయి. మృతురాలి కార్డుపై ప్రతి నెలా కేటాయించే 35 కిలోల బియ్యం ఎవరికి వెళ్తోంది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సల్బత్తాపూర్కు చెందిన జనగామ బాలమ్మ, భర్త నర్సయ్య రెండేళ్ల క్రితం మృతి చెందారు. బాలమ్మ జీవించి ఉన్న సమయంలో ఆమె రేషన్ కార్డు ద్వారా ప్రతి నెలా 35 కిలోల బియ్యం అందేది. ఆమె మృతి తర్వాత కార్డు కూడా రద్దయి ఉంటుందని కుటుంబ సభ్యులు భావించి ఇంతకాలం పట్టించుకోలేదని తెలిపారు. అయితే శనివారం బాలమ్మ మనుమడు జనగామ వెంకటేష్ ఆన్లైన్లో రేషన్ కార్డు వివరాలను పరిశీలించడంతో విషయం వెలుగులోకి వచ్చిందని పేర్కొన్నారు. మృతురాలి పేరుతో కొనసాగుతున్న రేషన్ కార్డులో ఇతర వ్యక్తుల పేర్లు నమోదై ఉండటాన్ని గుర్తించినట్లు తెలిపారు. ఆ కార్డు ఆధారంగా గత రెండేళ్లుగా బియ్యం తీసుకుంటున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు.
*అధికారుల విచారణకు డిమాండ్.
మృతురాలి పేరుతో ఉన్న రేషన్ కార్డులో ఇతరుల పేర్లు ఎలా నమోదయ్యాయి? ఎవరి ఆదేశాలతో మార్పులు చేశారు? గత రెండేళ్లుగా బియ్యం ఎవరు తీసుకున్నారు? అనే అంశాలపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని వెంకటేష్ కోరారు. రేషన్ కార్డు వివరాలు, బియ్యం పంపిణీ రికార్డులను పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తేవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో ఎవరైనా అక్రమాలకు పాల్పడినట్లు తేలితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. సంబంధిత రెవెన్యూ, పౌరసరఫరాల అధికారులు స్పందించకపోతే వికారాబాద్ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తానని వెంకటేష్ స్పష్టం చేశారు. మృతుల పేర్లతో కొనసాగుతున్న రేషన్ కార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, వాటిలో అనధికారికంగా పేర్ల మార్పులు జరిగాయా? అనే అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
