- District News
- Khammam
- ప్రభుత్వ విద్యా ప్రమాణాల పెంపుతో పాటు మౌళిక వసతుల బలోపేతానికి ప్రాధాన్యత.. జిల్లా కలెక్టర్ దివాకర టి...
ప్రభుత్వ విద్యా ప్రమాణాల పెంపుతో పాటు మౌళిక వసతుల బలోపేతానికి ప్రాధాన్యత.. జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయాలు వేదికలుగా నిలవాలి.
విద్యార్థులకు సురక్షితమైన, ఆహ్లాదకరమైన విద్యా వాతావరణం కల్పించాలి.
ఖమ్మం, ఆగస్టు-18: లోకల్ గైడ్:
మంగళవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని పోలేపల్లి షిరిడి సాయినాథ్ నగర్ లోని ఖమ్మం పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యాలయ మేనేజ్మెంట్ కమిటీ(VMC) సమావేశం జిల్లా కలెక్టర్, వియంసి చైర్మన్ దివాకర టీఎస్ అధ్యక్షతన నిర్వహించారు. విద్యాలయంలోని విద్యా ప్రమాణాలు, విద్యార్థుల పరీక్ష ఫలితాలు, ప్రవేశాల పరిస్థితి, సహపాఠ్య కార్యక్రమాలు, పీఎం శ్రీ కార్యక్రమాల అమలు, డిజిటల్ విద్య, మౌళిక వసతులు, విద్యార్థుల భద్రత, విద్యాలయ అభివృద్ధికి అవసరమైన కార్యచరణ, అభివృద్ధి పనులపై సమగ్రంగా సమీక్షించారు.
విద్యార్థుల విద్యా ప్రగతిపై నిరంతర పర్యవేక్షణ ముందుగా విద్యాలయం లో గత విద్యా సంవత్సరంలో సాధించిన విద్యా ఫలితాలు, విద్యార్థుల ప్రగతి, సహ పాఠ్య కార్యక్రమాల్లో సాధించిన విజయాలపై అధికారులు, ఉపాధ్యాయుల నుంచి వివరాలను కలెక్టర్ తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ*, విద్యార్థుల విద్యా సామర్థ్యాలను నిరంతరం అంచనా వేస్తూ, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. విద్యార్థులలో కేవలం పుస్తక పరిజ్ఞానాన్ని పెంపొందించడం మాత్రమే కాకుండా, భవిష్యత్తులో ఉన్నత విద్య, పోటీ పరీక్షలు, ఉపాధి అవకాశాలను ఎదుర్కొనే విధంగా అవసరమైన నైపుణ్యాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ అన్నారు.
2026–27 విద్యా సంవత్సరంలో పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో కొత్తగా మొత్తం 256 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించినట్లు సమావేశంలో అధికారులు వివరించారు. ఇందులో 1వ తరగతిలో 121 మంది విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా ప్రవేశాలు కల్పించగా, కేవీఎస్ నిబంధనల ప్రకారం మరో 22 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించినట్లు వివరించారు.
విద్యార్థుల ప్రవేశ ప్రక్రియలో పారదర్శకత, నిబంధనల అమలు తప్పనిసరిగా ఉండాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు, ఫర్నిచర్, తాగునీరు, పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు, విద్యుత్, డిజిటల్ పరికరాలు వంటి సౌకర్యాలు సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
డిజిటల్ విద్యకు ప్రాధాన్యత
విద్యాలయంలో డిజిటల్ విద్యకు అందుబాటులో పాఠశాలలో 55 కంప్యూటర్లు, హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్, వై–ఫై కనెక్టివిటీ, 25 ఈ–క్లాస్రూమ్లు/ ఇంటరాక్టివ్ బోర్డు ప్యానెల్స్ అందుబాటులో ఉన్నాయని అధికారులు వివరించారు.
సీనియర్, జూనియర్ కంప్యూటర్ ల్యాబ్లను విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా మరింత సమర్థవంతంగా వినియోగించాలని కలెక్టర్ సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థుల అభ్యసనలో భాగం చేయాలని, డిజిటల్ వనరుల ద్వారా బోధనను మరింత ఆసక్తికరంగా, ప్రభావవంతంగా నిర్వహించాలని అన్నారు.
క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యత
విద్యాలయంలో సుమారు మూడు ఎకరాల విస్తీర్ణంలో విశాలమైన క్రీడా మైదానం ఉందని, బాస్కెట్బాల్, ఫుట్బాల్, హ్యాండ్బాల్, రెండు ఖో–ఖో కోర్టులు, కబడ్డీ కోర్టు వంటి సదుపాయాలు ఉన్నాయని అధికారులు వివరించారు.
విద్యాలయ అవసరాలను సమీక్షించిన సందర్భంగా పలు అభివృద్ధి పనులను చేపట్టేందుకు ప్రతిపాదనలు సమావేశం చర్చించారు.
విద్యాలయంలో ప్రధాన సమస్యలుగా గుర్తించిన సమస్యలపై, విద్యార్థుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. పాఠశాల ఆవరణలో చెట్ల కొమ్మలను తొలగించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, పాములు సంచరించే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
కోతి బెడద నివారణకు సంబంధిత శాఖల సమన్వయంతో చర్యలు చేపట్టాలని, విద్యార్థులు పాఠశాలకు రాకపోకలు సాగించే అప్రోచ్ రోడ్డును సురక్షితంగా మార్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా, పచ్చదనంతో, ఆహ్లాదకరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, మొక్కల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ పేర్కొన్నారు. విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు పర్యావరణ కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో ప్రిన్సిపాల్స్ జి. విజయలక్ష్మి, వెంకటరమణ, డివైఎస్వో టి. సునీల్ రెడ్డి, ఆర్&బీ ఎస్ఈ యుగంధర్, డి. నవీన్ కుమార్, మెడికల్ ఆఫీసర్ యం. మహేందర్ రెడ్డి, పెరెంట్స్ మెంబర్ యం.అనిత, అధికారులు ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
