- District News
- Khammam
- ఖమ్మంలో రైతు కూలీల జాతీయ మహాసభలకు సన్నాహాలు
ఖమ్మంలో రైతు కూలీల జాతీయ మహాసభలకు సన్నాహాలు
సెప్టెంబర్ 28న భారీ బహిరంగ సభ.. 29, 30న జాతీయ మహాసభలు — ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ప్రకాష్
ఖమ్మం జిల్లా , కారేపల్లి, ఆగస్టు 21 (లోకల్ గైడ్) :
ఖమ్మం నగరంలో సెప్టెంబర్ 28 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్న అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ప్రకాష్ పిలుపునిచ్చారు. ఖమ్మం లెనిన్నగర్లోని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ కార్యాలయంలో ఏఐకేఎంఎస్ ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షులు బజ్జూరి వెంకట్రాంరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో వై. ప్రకాష్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రైతులు, వ్యవసాయ కూలీలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం 2025–26 సంవత్సరానికి ప్రకటించిన పంటల ధరలు రైతులకు ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదని విమర్శించారు. మొక్కజొన్న, వరి తదితర పంటలకు స్వల్పంగా ధరలు పెంచడం వల్ల రైతులకు ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు. పెరిగిన సాగు ఖర్చులకు అనుగుణంగా పంటలకు గిట్టుబాటు ధరలు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. రైతులు నష్టాల పాలయ్యే విధానాలను కేంద్ర ప్రభుత్వం విడనాడాలని, వ్యవసాయ రంగాన్ని కాపాడేందుకు సమగ్ర చర్యలు చేపట్టాలని కోరారు. అమెరికా తదితర దేశాలతో కేంద్ర ప్రభుత్వం కుదుర్చుకుంటున్న వాణిజ్య ఒప్పందాలను పునఃసమీక్షించాలని వై. ప్రకాష్ డిమాండ్ చేశారు. వాణిజ్య ఒప్పందాలు దేశ రైతాంగ ప్రయోజనాలకు అనుకూలంగా ఉండాలి తప్ప, విదేశీ ప్రయోజనాలకు అనుకూలంగా ఉండే విధానాలను కేంద్ర ప్రభుత్వం అనుసరించరాదని అన్నారు. ఏఐకేఎంఎస్ తెలంగాణ రాష్ట్ర మహాసభలు సెప్టెంబర్ 8, 9 తేదీల్లో మంచిర్యాలలో, సెప్టెంబర్ 28న ఖమ్మంలో భారీ బహిరంగ సభ, 29, 30 తేదీల్లో జాతీయ మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మహాసభల్లో రైతులు, వ్యవసాయ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను రూపొందించనున్నట్లు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు, కూలీ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. రైతులు, వ్యవసాయ కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొని బహిరంగ సభ, జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని వై. ప్రకాష్ కోరారు. సమావేశంలో ఏఐకేఎంఎస్ నాయకులు మందుల రాజేంద్రప్రసాద్, ఎం. గిరి, ఎస్.కె. కాసిం, లింగన్న, మురళి, అప్పారావు, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
