- District News
- 22ఏ నిషేధిత భూములపై సమగ్ర విచారణ జరపాలి
22ఏ నిషేధిత భూములపై సమగ్ర విచారణ జరపాలి
రెవెన్యూ మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయాలి: బీజేపీ నాయకుల డిమాండ్
-
22ఏ నిషేధిత భూముల వ్యవహారంలో చోటుచేసుకున్నట్లు వస్తున్న ఆరోపణలు, అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు పెద్దపల్లి జిల్లా కలెక్టర్, ఏ.ఓ.కు వినతిపత్రం సమర్పించారు. బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు, పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కర్రే సంజీవరెడ్డి సూచనలతో జిల్లా కార్యదర్శి శివంగారి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 22ఏ నిషేధిత భూముల జాబితాలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమ చేర్పులు, తొలగింపులు, భూ రికార్డుల మార్పులపై ప్రభుత్వం పారదర్శకంగా విచారణ చేపట్టాలని కోరారు. జిల్లాలోని 22ఏ నిషేధిత భూముల పూర్తి జాబితాను గ్రామం, మండలం, సర్వే నంబర్ వారీగా ప్రజలకు అందుబాటులో ఉంచాలని వారు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని చేర్పులు, తొలగింపులపై సమగ్ర ఆడిట్ నిర్వహించడంతో పాటు ధరణి, భూ భారతి తదితర డిజిటల్ భూ రికార్డులపై ఫోరెన్సిక్ ఆడిట్ చేపట్టాలని కోరారు. తప్పుగా 22ఏ జాబితాలో చేర్చిన భూములను గుర్తించి బాధిత యజమానులకు న్యాయం చేయాలని, అక్రమాలకు పాల్పడిన అధికారులు, సిబ్బంది, మధ్యవర్తులు, ఇతర వ్యక్తుల పాత్రపై విచారణ జరపాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. అవినీతి, కుట్ర లేదా అక్రమ ఆర్థిక లబ్ధికి సంబంధించిన ఆధారాలు వెలుగులోకి వస్తే బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా 22ఏ భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలని, ఆరోపణలపై స్వతంత్ర న్యాయ విచారణ లేదా సీబీఐ విచారణకు ప్రభుత్వం ఆదేశించాలని నాయకులు డిమాండ్ చేశారు. విచారణ పూర్తయ్యే వరకు అనుమానాస్పదంగా జరిగిన కొత్త చేర్పులు, మార్పులను ప్రత్యేకంగా పరిశీలించి భూ రికార్డుల భద్రతను కాపాడాలని సూచించారు. విచారణ నివేదికను ప్రజలకు బహిర్గతం చేసి, బాధ్యులపై తీసుకున్న చర్యలను స్పష్టంగా ప్రకటించాలని కోరారు. ఇదే సమయంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కుటుంబానికి చెందిన కంపెనీకి ‘ఫీనిక్స్’ అనే రియల్ ఎస్టేట్ సంస్థ నుంచి వేల కోట్ల విలువైన ఆస్తులు బదిలీ అయ్యాయనే ఆరోపణలపైనా ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. అందుబాటులో ఉన్న రికార్డులు, లావాదేవీలను పూర్తిగా పరిశీలించి వాస్తవాలను ప్రజల ముందుంచాలని కోరారు. 22ఏ భూముల వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి రాజీనామా చేయాలని లేదా ప్రభుత్వం వెంటనే ఆయనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. “ప్రజల భూముల విషయంలో ఎలాంటి అక్రమాలు, అవినీతి, అధికార దుర్వినియోగాన్ని బీజేపీ సహించదు. 22ఏ భూముల వ్యవహారంలో వాస్తవాలు వెలుగులోకి వచ్చే వరకు ప్రజల తరఫున పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. ప్రభుత్వం వెంటనే స్పందించి సమగ్ర విచారణకు ఆదేశించకపోతే ప్రజా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం” అని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాజాం మహంత్, రామగిరి అఖిల్ కుమార్, ఉషణ అన్వేష్, మంతెన కృష్ణ, రెండ్ల వేణు, కుమార్, సంపత్, మహేష్, శ్రావణ్, వినోద్, విశాల్ తదితరులు పాల్గొన్నారు.
