శ్రీవారి సేవే పరమ పూజ...

భక్తి భావంతో సేవలందిస్తున్న కుసుమ సుమలత బృందం

Published On
శ్రీవారి సేవే పరమ పూజ...

 


ఖమ్మం జిల్లా, కారేపల్లి (సింగరేణి ) : లోకల్ గైడ్, ఆగష్టు 5 : ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గేట్ కారేపల్లి గ్రామానికి చెందిన శ్రీమతి కుసుమ సుమలత ఆధ్వర్యంలోని శ్రీవారి సేవా బృందం తిరుమలలో భక్తి, సేవాభావానికి నిదర్శనంగా నిలుస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న శ్రీవారి సేవ కార్యక్రమంలో టీం లీడర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న కుసుమ సుమలత, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సేవా కార్యక్రమాలను సమర్థవంతంగా సమన్వయం చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.
ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా నుంచి వెళ్లిన భక్తులు ఆలయ పరిసరాల పరిశుభ్రత, క్యూలైన్లలో భక్తులకు మార్గదర్శనం, వృద్ధులు, మహిళలు, చిన్నారులకు సహాయం, అన్నప్రసాదం పంపిణీ, భక్తులకు అవసరమైన సమాచారాన్ని అందించడం వంటి పలు సేవా కార్యక్రమాల్లో నిస్వార్థంగా పాల్గొన్నారు. "మానవ సేవే మాధవ సేవ" అనే భావనతో సేవలను అందిస్తూ శ్రీవారి అనుగ్రహాన్ని పొందడం తమ అదృష్టమని సేవకులు తెలిపారు.
టీం లీడర్ కుసుమ సుమలత మాట్లాడుతూ, శ్రీవారి సేవలో పాల్గొనడం ప్రతి భక్తుడికి ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి అని, సేవ ద్వారా వినయం, క్రమశిక్షణ, మానవత్వం మరింత పెంపొందుతాయని పేర్కొన్నారు. తిరుమలలో సేవ చేసే అవకాశం కల్పించిన తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సేవా కార్యక్రమంలో కుసుమ నాగరాజు, కుసుమ రమేష్, కుసుమ రమ, కోడి వీరబాబు, చల్లా శ్రీనివాస్, లక్కీశెట్టి దివ్య, మోర విజయలక్ష్మి, గొట్టుపర్తి పార్వతి, కొల్లిపాక జ్యోతి, ముత్యాల మమత, పొట్ల జయశ్రీ భక్తి శ్రద్ధలతో పాల్గొని శ్రీవారి సేవలో తమ వంతు సేవలను అందించారు.
శ్రీవారి సేవలో ఖమ్మం జిల్లా భక్తులు చూపుతున్న సేవా తపన పలువురికి ఆదర్శంగా నిలుస్తుండగా, కుసుమ సుమలత నాయకత్వంలో ఈ బృందం మరెంతో మందిని సేవా కార్యక్రమాల వైపు ప్రోత్సహిస్తోందని స్థానికులు అభినందించారు.

Tags:

About The Author

Latest News