- District News
- Khammam
- కారేపల్లి ప్రజల సమస్యలపై పాలకవర్గం వెంటనే స్పందించాలి
కారేపల్లి ప్రజల సమస్యలపై పాలకవర్గం వెంటనే స్పందించాలి
రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్, పారిశుధ్య సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: సీపీఎం డివిజన్ కమిటీ సభ్యురాలు కొండబోయిన ఉమావతి
ఖమ్మం జిల్లా,కారేపల్లి (సింగరేణి ) : లోకల్ గైడ్, ఆగష్టు 6 : మండల కేంద్రం కారేపల్లిలో నెలకొన్న మౌలిక వసతుల సమస్యల పరిష్కారంలో స్థానిక పాలకవర్గం నిర్లక్ష్యాన్ని వీడి వెంటనే చర్యలు చేపట్టాలని సీపీఎం పార్టీ డివిజన్ కమిటీ సభ్యురాలు కొండబోయిన ఉమావతి డిమాండ్ చేశారు. ప్రజల ఇబ్బందులను గుర్తించి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆమె కోరారు.
గురువారం కారేపల్లిలో సీపీఎం గ్రామ శాఖ సమావేశం సీనియర్ నాయకులు తలారి దేవప్రకాష్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో మాట్లాడిన ఉమావతి, కారేపల్లిలో రోడ్లు అధ్వాన్నంగా మారడం, డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం, వీధిలైట్లు పనిచేయకపోవడం, విద్యుత్ కోతలు, మంచినీటి సమస్యలు, పారిశుధ్య లోపాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారానికి గ్రామపంచాయతీ పాలకవర్గం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
స్థానిక సినిమా హాల్, పాత డీబీ సెంటర్, ఇమ్మడి బజార్ ప్రాంతాల్లో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా వేలాడుతూ ఉండటం వల్ల ఎప్పుడైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆమె హెచ్చరించారు. విద్యుత్ శాఖ అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టి స్థానికంగా శాశ్వత లైన్మ్యాన్ను నియమించాలని, తరచూ ఏర్పడుతున్న విద్యుత్ అంతరాయాలకు ముగింపు పలకాలని డిమాండ్ చేశారు.
మండల కేంద్రంలోని అన్ని వీధుల్లో సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీల నిర్మాణాన్ని పూర్తి చేయడంతో పాటు బస్టాండ్ సెంటర్లో అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేయాలని కోరారు. అలాగే నిరుపయోగంగా ఉన్న ప్రజా మరుగుదొడ్లను అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రజల నివాస ప్రాంతాల మధ్య ఖాళీ స్థలాల్లో వర్షపు నీరు నిల్వ ఉండటంతో దోమలు పెరిగి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. పారిశుధ్య నిర్వహణను మెరుగుపరచడంతో పాటు నిల్వ నీటిని తొలగించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు సర్పంచ్, పాలకవర్గం, పంచాయతీ కార్యదర్శి సమన్వయంతో తక్షణ చర్యలు చేపట్టాలని ఉమావతి డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో సీపీఎం శాఖ కార్యదర్శి అన్నారు కృష్ణ, నాయకులు ముండ్ల ఏకాంబరం, ఇల్లంగి పిచ్చయ్య, పాసిని నాగేశ్వరరావు, షేక్ బందేలు, రాయమల్లు సీతారాములు, మహమ్మద్ పాషా, గ్రామ కార్యకర్తలు పాల్గొన్నారు.
