- District News
- Khammam
- మహనీయుల స్ఫూర్తితో భాగ్యనగర్ తండా అభివృద్ధికి కృషి
మహనీయుల స్ఫూర్తితో భాగ్యనగర్ తండా అభివృద్ధికి కృషి
సర్పంచ్ బానోత్ హీరాలాల్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో మహనీయుల చిత్రపటాల ఏర్పాటు
స్వాతంత్ర్య సమరయోధులు, మహనీయుల త్యాగాలు, వారి ఆశయాలు నేటి తరానికి నిరంతరం స్ఫూర్తినిచ్చేలా భాగ్యనగర్ తండా గ్రామపంచాయతీ కార్యాలయంలో మహనీయుల చిత్రపటాలను ఏర్పాటు చేశారు. స్వాతంత్ర్య పోరాటంలో ఎంతోమంది మహనీయులు చేసిన త్యాగాల ఫలితంగానే నేడు దేశ ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారని సర్పంచ్ బానోత్ హీరాలాల్ తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ బానోత్ హీరాలాల్ మాట్లాడుతూ.. మహనీయుల చిత్రపటాలను కార్యాలయంలో ఏర్పాటు చేయడం ద్వారా వారి త్యాగాలను నిత్యం స్మరించుకునే అవకాశం ఉంటుందన్నారు. మహనీయుల చిత్రాలను చూసినప్పుడు స్వార్థానికి తావులేకుండా ప్రజల కోసం సేవ చేయాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో కలగాలన్న ఉద్దేశంతోనే చిత్రపటాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహనీయుల స్ఫూర్తితో భాగ్యనగర్ తండా గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను నిరంతరం కొనసాగించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. మహనీయుల ఆశయాలను ఆదర్శంగా తీసుకుని గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సర్పంచ్ బానోత్ హీరాలాల్ పిలుపునిచ్చారు.
