- District News
- కొమరం భీమ్ ఆశయ సాధనతోనే ఆదివాసీల ఆత్మగౌరవం సాధ్యం .......మంత్రి సీతక్క
కొమరం భీమ్ ఆశయ సాధనతోనే ఆదివాసీల ఆత్మగౌరవం సాధ్యం .......మంత్రి సీతక్క
అశ్వారావుపేటలో వైభవంగా కొమరం భీమ్ విగ్రహావిష్కరణ ఆదివాసీల హక్కులు, సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది
లోకల్ గైడ్ : అశ్వారావుపేట
ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం, స్వేచ్ఛ, సమానత్వం కోసం పోరాడిన అమరవీరుడు కొమరం భీమ్ పోరాట స్ఫూర్తితో గిరిజన సమాజం ముందుకు సాగాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ (సీతక్క) పిలుపునిచ్చారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొమరం భీమ్ విగ్రహాన్ని ఆమె శనివారం ఘనంగా ఆవిష్కరించారు.
*అభిమాన నీరాజనాలు సంప్రదాయ స్వాగతం*
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి సీతక్కకు ఆదివాసీ ప్రజలు తమ సంప్రదాయ కొమ్ము డాన్స్లు, నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ అంకిత్లతో కలిసి మంత్రి భారీ ర్యాలీగా ప్రధాన కూడలికి చేరుకుని, విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
*పోరాటాల చరిత్ర ఆదివాసీలది*
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి సీతక్క మాట్లాడుతూ, కాకతీయుల కాలంలో సమ్మక్క-సారలమ్మల పోరాటం నుంచి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అల్లూరి సీతారామరాజు, నిజాం మూకలపై కొమరం భీమ్ చేసిన సమరాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని కొనియాడారు. జల్, జంగల్, జమీన్ నినాదంతో సాగిన భీమ్ పోరాటమే నేటి తెలంగాణ సాధన ఉద్యమానికి (నీళ్లు, నిధులు, నియామకాలు) దిశానిర్దేశం చేసిందన్నారు. ఆదివాసీల రాజ్యాంగబద్ధమైన హక్కులు, అడవి-భూమి హక్కులు, విద్య, ఉపాధి, గృహ వసతి కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
*అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి*
దూర ప్రాంతాల నుంచి తమ సమస్యల పరిష్కారం కోసం వచ్చే ఆదివాసీలను అధికారులు గౌరవించాలని, వారి అర్జీలను ఓపికగా విని తక్షణమే పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో ఇప్పటికే వివిధ శాఖల ద్వారా రూ. 1,200 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, రాబోయే రోజుల్లో స్కిల్ డెవలప్మెంట్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి శాఖల ద్వారా మరిన్ని నిధులు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. యువత చదువుతో పాటు నైపుణ్యాలను పెంచుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని, సొంత భాష, సంస్కృతిని విస్మరించవద్దని సూచించారు.
*గిరిజన మ్యూజియం ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే జారే ఆదినారాయణ*
అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల్లో ఐక్యత, విద్యాభివృద్ధి పెంచడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అశ్వారావుపేటలోని కొమరం భీమ్ అర్బన్ పార్కును మరింత అభివృద్ధి చేయడంతో పాటు, గిరిజన చరిత్ర, సంస్కృతి భావితరాలకు తెలిసేలా మ్యూజియం, గిరిజన విద్యా వికాస భవనాన్ని మంజూరు చేయాలని మంత్రి సీతక్కను కోరారు.
*సంక్షేమానికి జిల్లా యంత్రాంగం కృషి: కలెక్టర్ అంకిత్*
గిరిజనులకు ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ అంకిత్, కొమరం భీమ్, రాంజీ గోండు వంటి పోరాట యోధుల స్ఫూర్తితో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు పారదర్శకంగా అందిస్తామన్నారు. విద్యా, వైద్యం, మౌలిక వసతుల కల్పనకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ( డీఆర్డీఓ) విద్యా చందన, జెడ్పీ సీఈవో నాగలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు, ఆదివాసీ జేఏసీ నాయకులు, వివిధ గిరిజన సంఘాల ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
