- District News
- Ranga Reddy
- ఒక ఇంచు భూమి కూడా పోనివ్వను - తీన్మార్ మల్లన్న.
ఒక ఇంచు భూమి కూడా పోనివ్వను - తీన్మార్ మల్లన్న.
ఇప్పటి వరకు ఒకలెక్క - నేనొచ్చాకా ఇంకో లెక్క. ఆపద అంటే అర్థరాత్రైనా వస్తా- పేదల జోలికొస్తే ఖబడ్డార్. రాజేంద్ర నగర్ పోలీసులకు హెచ్చరిక.

రాజేంద్రనగర్ నియోజకవర్గం హనుమాన్ నగర్ లో కొన్ని దశాబ్దాలుగా నివసిస్తున్న 300 పేద కుటుంబాలకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అండగా నిలిచారు. తమ భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న రియల్ ఎస్టేట్ మాఫియాకు వత్తాసు పలుకుతున్న పోలీసుల తీరుపై మల్లన్న తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బాధితులకు ధైర్యం చెబుతూ వారి హక్కుల కోసం తాను ఎందాకైనా వెళ్లడానికి వెనుకాడబోనని స్పష్టం చేశారు. సోమవారం అయన టీమ్ తో హనుమాన్ నగర్ ను సందర్శించి పేదలతో మాట్లాడారు.
పోలీసులకు సీరియస్ వార్నింగ్: కోర్టు ఆర్డర్ గౌరవించకుంటే బోనులో నిలబెడతాం.
సివిల్ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోవద్దని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని మల్లన్న గుర్తు చేశారు. అయినప్పటికీ, రాజేంద్రనగర్ పోలీసులు రియల్ ఎస్టేట్ మాఫియా, పక్కనే ఉన్న విల్లా యజమానుల దగ్గర డబ్బులు తీసుకుని గుండాలతో జతకట్టి పేదలను వేదిస్తే ఊరుకునేది లేదన్నారు. పోలీసులే గుండాలను పెట్టి ప్రజలను కొట్టడం, ఇళ్ల నుంచి తరిమేయడం వంటి కుట్రలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కోర్టు తీర్పును ధిక్కరించి పోలీసులు భూముల్లోకి వస్తే వారి పేర్లను వీడియో తీసి పెట్టాలన్నారు. స్వయంగా తానే వారిపై హైకోర్టులో కేసులు వేయిస్తానని హెచ్చరించారు. ప్రజలను పోలీస్ స్టేషన్కు పిలిచి రాజీ పడాలని ఒత్తిడి చేసే అధికారులను రేపు పొద్దున దోషులుగా నిలబెడతామని రాజేంద్రనగర్ పోలీసులను హెచ్చరించారు.
*"ఇంచు భూమి కూడా పోనివ్వను"*
బాధితులతో ముఖాముఖి మాట్లాడిన మల్లన్న, వారికి కొండంత ధైర్యాన్ని ఇచ్చారు.మీ భూమిలో నుంచి ఇంచు భూమి కూడా పోనివ్వనని,నేను మీకు అండగా ఉన్నానని భరోసా ఇచ్చారు.పోలీసులు లేదా గుండాలు అర్ధరాత్రి వేళ వచ్చినా సరే, ఒక్క ఫోన్ కాల్ చేస్తే తాను రాత్రి 2 గంటలకైనా నేరుగా అక్కడికి చేరుకుంటానని హామీ ఇచ్చారు.ఈ పోరాటంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ సైన్యం కూడా ప్రజలకు తోడుగా ఉంటుందని, ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని చెప్పారు.
గతంలో గౌలిదొడ్డి వద్ద పేదల భూములను కబ్జా చేయడానికి గుండాలు ప్రయత్నించినప్పుడు, తానే స్వయంగా వెళ్లి అక్కడ కట్టిన షీట్లను తన్ని పడేశానని మల్లన్న గుర్తు చేశారు. నేడు అక్కడ పేదలే రాజసం అనుభవిస్తున్నారని, అదే తరహాలో రాజేంద్రనగర్ పేదలకు కూడా న్యాయం చేస్తానని ఆయన స్పష్టం చేశారు.
భూ సమస్యపై సైబరాబాద్ సీపీకి, హోమ్ సెక్రటరీకి మరియు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు అందజేస్తున్నట్లు మల్లన్న తెలిపారు. బాధ్యులైన పోలీసులపై మరియు కబ్జాదారులపై చట్టపరమైన పోరాటం చేస్తామని, పేదలకు న్యాయం జరిగే వరకు విశ్రమించబోనని తెలిపారు.
