సిద్దిపేట, ఆగస్టు 12(లోకల్ గైడ్):
గిరిజన యువత ఉద్యోగాలు వెతుక్కునే స్థాయి నుంచి పది మందికి ఉద్యోగాలు కల్పించే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఆకాంక్షించారు. సిద్దిపేటలో ట్రైబల్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (TICCI) ఆధ్వర్యంలో నిర్వహించిన గిరిజన పారిశ్రామికవేత్తల అవగాహన సదస్సు, సిద్దిపేట జిల్లా చాప్టర్ ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ గిరిజన యువత వ్యాపార రంగంలో రాణించేందుకు ఆత్మవిశ్వాసం, పట్టుదల, క్రమశిక్షణ అవసరమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు, సబ్సిడీలను సద్వినియోగం చేసుకునేలా TICCI మార్గదర్శకత్వం అందించడం అభినందనీయమన్నారు.బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గిరిజన అభివృద్ధికి పెద్దఎత్తున సబ్సిడీలు అందించామని, గిరిజన మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు, గురుకులాలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య అందించామని తెలిపారు. గిరిజనులకు రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచామని, 3,300 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి గిరిజనులకు రాజకీయ సాధికారత కల్పించామని పేర్కొన్నారు. ఆరు లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు అందించామని చెప్పారు.ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని హరీశ్ రావు విమర్శించారు. ఎస్టీ కార్పొరేషన్కు రూ.2,730 కోట్లు కేటాయించినట్లు ప్రభుత్వం చెప్పినా, అందులో కేవలం రూ.70 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని ఆరోపించారు. గిరిజన యువతకు ఉపాధి కల్పించేందుకు నిధులు పూర్తిస్థాయిలో వినియోగించాలని డిమాండ్ చేశారు.లగచర్ల ఘటనలో భూములు ఇవ్వబోమని ప్రశ్నించిన గిరిజనులపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. గిరిజనుల భూములను లాక్కుంటున్నారని, ఎస్టీ ఎస్డీఎఫ్ నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేయడం లేదని విమర్శించారు.గిరిజన యువతకు న్యాయం జరిగేలా TICCI కేవలం సహాయక సంస్థగా కాకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రెజర్ గ్రూప్గా కూడా పనిచేయాలని సూచించారు. పెండింగ్లో ఉన్న సబ్సిడీలను రాబట్టేందుకు కృషి చేయాలని, గిరిజనుల సమస్యలపై అసెంబ్లీలో బీఆర్ఎస్ తరఫున పోరాడుతామని హరీశ్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లాలోని గిరిజన యువత TICCI సేవలను సద్వినియోగం చేసుకుని నైపుణ్యాలను పెంపొందించుకొని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని పిలుపునిచ్చారు.