- District News
- తహసీల్దార్ హామీతో ఆమరణ నిరాహార దీక్ష విరమణ
తహసీల్దార్ హామీతో ఆమరణ నిరాహార దీక్ష విరమణ
మాట తప్పితే మరోమారు పోరాటం తప్పదు : మహా రుద్రసేన వ్యవస్థాపకులు కొండా చరణ్
చర్ల : లోకల్ గైడ్ న్యూస్ :
చర్ల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట శ్రీశ్రీశ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయానికి సంబంధించిన ప్రభుత్వ భూమిని ఆక్రమణదారుల నుంచి కాపాడాలని మహా రుద్రసేన ఆధ్వర్యంలో కొండా చరణ్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను తహసీల్దార్ హామీతో విరమించారు. 8వ రోజులుగా కొనసాగిన దీక్ష శిబిరాన్ని ఎనిమిదో రోజు తహసీల్దార్, ఎస్సై నర్సిరెడ్డి సందర్శించారు. దీక్ష డిమాండ్లను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఆక్రమణకు పాల్పడే వారిపై తక్షణమే కేసులు నమోదు చేస్తామని, అక్కడ నిర్మించిన కట్టడాలను త్వరలోనే తొలగిస్తామని, విద్యుత్ మీటర్లను రద్దు చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఆలయ భూమికి సంబంధించిన అంశంపై ఉన్నతాధికారులతో చర్చించి వారి సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటామని, అప్పటివరకు ఎవరూ ఆ భూముల్లోకి వెళ్లరాదని అధికారులు స్పష్టం చేసినట్లు కొండా చరణ్ తెలిపారు. ఈ సందర్భంగా కొండా చరణ్ మాట్లాడుతూ ఆక్రమణదారులపై వీలైనంత త్వరగా కేసులు నమోదు చేయాలని, ఇళ్లకు ఏర్పాటు చేసిన విద్యుత్ మీటర్లను వెంటనే తొలగించాలని కోరారు. ఆ భూమి ఆలయానికి సంబంధించినదేనని, దానిని ఆలయ కమిటీకి అప్పగించడమే న్యాయమని అన్నారు. అప్పటివరకు ఆలయ భూమిలో పూజలు నిర్వహించేందుకు అనుమతి కల్పించాలని కోరారు. ఆక్రమణదారులు తప్పు చేసిన నేపథ్యంలో ఆలయ కమిటీ సభ్యులను సైతం అక్కడికి వెళ్లకుండా అడ్డుకోవడం సమంజసం కాదని అన్నారు. అధికారులు ఇచ్చిన హామీలను అమలు చేస్తారనే నమ్మకంతో ప్రస్తుతానికి ఆమరణ నిరాహార దీక్షను విరమిస్తున్నట్లు తెలిపారు. భూమిని ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసని, ఇకపై తమ పోరాటాన్ని మరో రూపంలో కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అధికారులు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే మరోమారు మహా ఉద్యమం చేపట్టడం తప్పదని హెచ్చరించారు. దీక్ష విజయవంతం కావడానికి సహకరించిన ప్రజలు, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. హిందూ దేవాలయాల రక్షణతో పాటు హిందువుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు హిందూ సమాజం ఐక్యంగా ఉండాలని, ధర్మ రక్షణ కోసం కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహా రుద్రసేన సభ్యులు, ప్రజాసంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
