- District News
- వినాయక చవితి పండుగను నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలి
వినాయక చవితి పండుగను నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలి
వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ
లోకల్ గైడ్, వికారాబాద్ :
గురువారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు గణేష్ నవరాత్రి ఉత్సవ ఏర్పాట్ల పై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ స్నేహ మెహర, అదనపు కలెక్టర్ వెంకటాచారి అడిషనల్ ఎస్ పి లతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..ఈ నెల 14న వినాయక చవితి పండుగ సందర్భంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, భక్తులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఏర్పాట్లు చేయాలని, వినాయకుల నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని, నిమజ్జనానికి అవసరమైన రూట్ మ్యాపులు సిద్ధం చేసుకోవాలని, అవసరమైన రూట్లలో రోడ్ల మరమ్మత్తు పనులు పూర్తి చేయాలని తెలిపారు. వినాయక చవితి నిమజ్జనానికి చెరువుల వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఫస్ట్ ఎయిడ్ కిట్లను మెడికల్ ఆఫీసర్, సిబ్బందితో బృందాలను ఏర్పాటు చేసి
అందుబాటులో ఉంచాలన్నారు. వినాయక నిమజ్జన స్థలాల వద్ద భారీ క్రేన్లను ఏర్పాటు చేయాలన్నారు. నిమజ్జనం సాయంత్రం వేళ జరుగుతున్నందున నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా, విద్యుత్ వైర్ లను సరి చేయాలనీ విద్యుత్ శాఖ అధికారులు ఇప్పటినుంచే అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. వినాయక నిమజ్జన సమయంలో విద్యుత్ తీగల సమస్య ఉత్పన్నం కాకుండా ముందస్తు చర్యలు తీసుకొని అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ శాఖ అధికారులు నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తూ ప్రతి చెరువు దగ్గర విద్యుత్ సిబ్బందిని అందుబాటులో ఉండేలాచూడాలన్నారు.
విద్యుత్ శాఖ అధికారుల సహకారంతో మండపాలకు విద్యుత్ కనెక్షన్ తీసుకోవాలన్నారు.గణేష్ నవరాత్రులు మొదలుకొని నిమర్జనం పూర్తయ్యే వరకు అగ్నిమాపక శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. మండపాలలో అనుకోకుండా అగ్ని ప్రమాదాలు జరిగితే ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి అనే వాటి మీద అవగాహన కలిగి ఉండాలన్నారు. చెరువుల దగ్గర బరికేడ్స్ మరియు గజ ఈ తగాళ్ల ను ఏర్పాటు చేయాలనీ, ఉత్సవ కమిటీ సభ్యులు గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఘనంగా పండగ వాతావరణంలో జరుపుకునేందుకు సహాయ సహకారాలు అందివ్వాలని తెలిపారు.
జిల్లా ఎస్పీ స్నేహ మెహర మాట్లాడుతూ... జిల్లా లో గణేష్ నిమజ్జనం రోజు ఎట్టి పరిస్థితుల్లో డి జే కు పరిమిషన్ లేదని,ప్రశాంత వాతావరణం లో పండుగ జరుపుకోవాలని అన్నారు. ఉత్సవ కమిటీ, పోలీస్ వారితో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకోవాలన్నారు.గణేష్ పండుగను శాంతియుతంగా జరుపుకునేందుకు విగ్రహాన్ని పెట్టుకునే ప్రతి ఒక్కరు గణేష్ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకునే విధంగా ఉత్సవ కమిటీ సభ్యులు చూడాలని అన్నారు. ఆన్లైన్లో నమోదు చేసిన వివరాలు బట్టి పోలీసు బందోబస్తు ఏర్పాట్లు పటిష్టంగా చేయడం జరుగుతుందన్నారు. రాత్రి సమయంలో మండపాల వద్ద వాలంటీర్లు ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. గణేష్ మండపాలు రోడ్లను బ్లాక్ చేసి పెట్టడం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఉత్సవ కమిటీ హిందూ పద్ధతి ప్రకారం గణేష్ ఉత్సవాలకు భజన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.ప్రతి గణేష్ మండపం వద్ద అవసరమైన బందోబస్తు ఏర్పాటు, గణేష్ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అన్నారు.
ముందుగా ఉత్సవ కమిటీ సభ్యులు తమ సూచనలు, సలహాలు తెలియ జేశారు.
సమావేశం లోఅడిషనల్ ఎస్ పి రాజేష్ మినా,ట్రైని కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుటూరు, డి ఆర్ ఓ స్వర్ణలత, వికారాబాద్, తాండూర్, పరిగి, కొడంగల్ ఉత్సవ కమిటీల సభ్యులు, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు , తదితరులు పాల్గొన్నారు.
