ఫార్మాస్యూటికల్ పరిశోధనలో
డాక్టర్ రాధిక ముత్తడికి పీహెచ్డీ
పఠాన్ చేరు, (లోకల్ గైడ్ ప్రతినిధి): ఫార్మాస్యూటికల్ పరిశోధనను విజయవంతం గా పూర్తిచేసిన హైదరాబాదు లోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ పరిశోధక విద్యార్థిని రాధిక ముత్తడిని డాక్టరేట్ వరించింది. సూపర్ సాచురబుల్ సెల్ప్-నానో ఎమల్సిఫైయింగ్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ ( స్నేడ్స్) ఉపయోగించి బీసీఎస్ క్లాస్-II ఔషధాల ద్రావణీయత, జీవ లభ్యతను పెంచడంపై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.శివకుమార్ శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. పిత్త వాహిక క్యాన్సర్ (చోలాంగియోకార్సినోమా) కోసం పెమిగాటినిబ్, ఎంట్రెక్టినిబ్ లక్షిత చికిత్సల కోసం అధునాతన ఔషధ పంపిణీ వ్యవస్థలను అభివృద్ధి చేయడంపై డాక్టర్ రాధిక అధ్యయనం దృష్టి సారించిందన్నారు. నోటి జీవ లభ్యతను మెరుగుపరచడాని కి నానోటెక్నాలజీ ఆధారిత స్నేడ్స్ ఉపయోగించి, స్థిరమైన, ప్రభావవంతమైన డెలివరీ వ్యవస్థలను రూపొందించడానికి, వర్గీకరించడానికి దశ-రేఖాచిత్ర విశ్లేషణ, గణాంక ఆప్టిమైజేషన్ ను ఆమె ఉపయోగించినట్టు తెలియజేశారు. అవక్షేపణ నిరోధకంగా హెచ్ పిఎంసి - కే 4 ఏం యొక్క ఆశాజనక ఉపయోగాన్ని పరిశోధన ఎత్తి చూపడమే గాక, క్యాన్సర్ చికిత్సలో భవిష్యత్తులో వివో అధ్యయనాలకు విలువైన ఫార్మకోకైనటిక్ అంతర్దృష్టుల ను అందిస్తుందన్నారు.
డాక్టర్ రాధిక సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్డీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం, హైదరాబాద్ అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, పలు విభాగాల అధిపతులు, సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
డాక్టర్ రాధిక విజయం, గీతం యొక్క విద్యా నైపుణ్యం, ప్రభావవంతమైన పరిశోధన పట్ల అచంచలమైన నిబద్ధతను నిదర్శనమన్నారు.