- District News
- తాండూర్లో 52.8 కిలోల గంజాయి పట్టివేత.
తాండూర్లో 52.8 కిలోల గంజాయి పట్టివేత.
ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, రిమాండ్ కు తరలింపు. - నిందితుల నుంచి రూ.13.20 లక్షల విలువైన గంజాయి స్వాధీనం.
లోకల్ గైడ్ /తాండూర్:
ఒరిస్సా నుంచి ఎండు గంజాయి రవాణా చేస్తున్నారన్న నమ్మదగిన సమాచారం మేరకు,తాండూర్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం రాత్రి తనిఖీలు నిర్వహించి నిందితులనుంచి 52.8 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వికారాబాద్ ఎక్సైజ్ డిఈపిఓ అధికారి శ్రీనివాస్ వెల్లడించారు. ఇందుకు సంబంధించి బుధవారం తాండూర్ ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. గంజాయిని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. అంతేకాకుండా
వారి వద్ద నుంచి నాలుగు ట్రావెలింగ్ బ్యాగులు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.13.20 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. ఒడిశాలోని గంజాం జిల్లా నుంచి గంజాయిని తాండూర్కు తరలించి విక్రయించేందుకు తీసుకువచ్చినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు.
మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. సమాచారం ఉంటే 8712658754 నంబర్కు తెలియజేయాలని, సమాచారదాతల వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు, డివిజన్ అధికారులు తదితరులు ఉన్నారు.
