- District News
- బీఆర్ఎస్ మాజీ ఉపసర్పంచ్ సల్మాన్ ఖాన్ అకాల మరణం
బీఆర్ఎస్ మాజీ ఉపసర్పంచ్ సల్మాన్ ఖాన్ అకాల మరణం
మతాలకు అతీతంగా తరలివచ్చి అంతిమ నివాళులర్పించిన జనం
భూపాలపల్లి (లోకల్ గైడ్ ప్రతినిధి)
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మాజీ ఉపసర్పంచ్ మొహమ్మద్ సల్మాన్ ఖాన్ అనారోగ్యంతో మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన అకాల మరణ వార్త తెలియడంతో మహాదేవపూర్ మండల వ్యాప్తంగా తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.
అతి పిన్న వయసులోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సల్మాన్ ఖాన్, ఉపసర్పంచ్గా గెలుపొంది మండలంలో యువతకు ఆదర్శంగా నిలిచారు. ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ, ప్రతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ యువతను ముందుండి నడిపించే నాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన హఠాన్మరణం స్థానికులను తీవ్రంగా కలచివేసింది.
సల్మాన్ ఖాన్ అంత్యక్రియలకు కులమతాలకు అతీతంగా ప్రజలు, యువకులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆయన సేవలను, మంచితనాన్ని గుర్తుచేసుకుంటూ స్థానికులు అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు.
సల్మాన్ ఖాన్ మృతి వార్త తెలుసుకున్న మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు మరియు భూపాలపల్లి జిల్లా చైర్పర్సన్ జక్కు శ్రీ హర్షిని రాకేష్ వెంటనే మహాదేవపూర్ చేరుకుని మృతుడి భౌతికకాయానికి గులాబీ కండువా కప్పి పూలమాలవేసి నివాళులర్పించారు. మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అక్కడే దగ్గరుండి కార్యక్రమాలను పర్యవేక్షించి నిర్వహించారు. సల్మాన్ మృతిపై పలువురు స్థానిక నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు తీవ్ర సంతాపం ప్రకటించారు.
