- District News
- తల్లి పాలే శిశువుకు సంపూర్ణ ఆరోగ్య రక్షణ
తల్లి పాలే శిశువుకు సంపూర్ణ ఆరోగ్య రక్షణ
పేరూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం
పేరూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో పేరూరు గ్రామపంచాయతీ పరిధిలోని పేరూరు 2 అంగన్వాడి కేంద్రంలో తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రతి తల్లి తన బిడ్డకు తల్లిపాలను అందించాలని వైద్య సిబ్బంది సూచించారు.
శిశువు జన్మించిన ఒక గంటలోపే తల్లిపాలను ప్రారంభించడం ఎంతో ముఖ్యమని, మొదటి ఆరు నెలల పాటు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని వైద్యులు తెలిపారు. తల్లిపాలలో శిశువు ఎదుగుదలకు అవసరమైన అన్ని పోషకాలు, వ్యాధి నిరోధక శక్తిని పెంచే రక్షణ పదార్థాలు సహజంగా ఉంటాయని వివరించారు.
తల్లిపాల వల్ల ప్రయోజనాలు
- శిశువుకు అవసరమైన సంపూర్ణ పోషకాహారం లభిస్తుంది.
- శిశువులో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
- విరేచనాలు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు వంటి అనేక వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.
- శిశువు మెదడు మరియు శారీరక ఎదుగుదలకు తోడ్పడుతుంది.
- తల్లికి ప్రసవానంతరం త్వరగా కోలుకోవడంలో సహాయపడుతుంది.
- తల్లి–బిడ్డల మధ్య అనుబంధం మరింత బలపడుతుంది.
ముఖ్యంగా: శిశువు పుట్టిన వెంటనే వచ్చే పసుపు రంగు చిక్కటి పాలను (ముర్రుపాలు/కొలస్ట్రం) తప్పనిసరిగా బిడ్డకు ఇవ్వాలి. ఇది శిశువుకు తొలి సహజ టీకా వంటిది. తేనె, నీరు, గ్లూకోజ్ నీరు లేదా ఇతర ఆహార పదార్థాలను మొదటి ఆరు నెలల్లో ఇవ్వకూడదు.
తల్లులు, కుటుంబ సభ్యులు తల్లిపాలపై ఉన్న అపోహలను తొలగించుకుని, శిశువుకు తల్లిపాలను అందించడంలో తల్లికి సహకరించాలని ఆరోగ్య సిబ్బంది సూచించారు.
ఈ కార్యక్రమంలో హెచ్.ఈ.ఓ వేణుగోపాలకృష్ణ, హెచ్.ఏ శకుంతల, హెచ్.ఏ శ్రీను అంగన్వాడీ టీచర్ శివరాజ్యం, చిలకమ్మా, రమాదేవి, కళావతి, సుప్రియ మరియు ఆశా కార్యకర్తలు గర్భవతులు బాలింతలు గ్రామస్తులు పాల్గొన్నారు
