- District News
- ఇది ప్రజాస్వామ్యమా రాక్షస రాజ్యమా?
ఇది ప్రజాస్వామ్యమా రాక్షస రాజ్యమా?
అసెంబ్లీ సాక్షిగా ఖాకీల పైశాచికంపై తాటి వెంకటేశ్వర్లు నిప్పులు
లోకల్ గైడ్ : అశ్వారావుపేట
ప్రజాస్వామ్య దేవాలయం ముంగిట ఖాకీ బూట్ల చప్పుడుతో ప్రతిపక్షాల గొంతు నొక్కే దుర్మార్గపు సంస్కృతికి తెరలేచిందని, ప్రజా సమస్యలపై శాంతియుతంగా గళమెత్తుతున్న ప్రతిపక్ష నేతలను అణచివేయడమే ప్రజాపాలనా? అని మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో నిలదీశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అక్రమ అరెస్టులను ఆయన ముక్తకంఠంతో ఖండించారు. ప్రస్తుత పాలకుల వైఖరి చూస్తుంటే తెలంగాణలో ప్రజాస్వామ్యం బతికే ఉందా లేక నిరంకుశ పాలన నడుస్తోందా అన్న అనుమానం కలుగుతోందని మండిపడ్డారు.
*సంస్కారహీనమైన చర్య.. సబితమ్మపై పురుష పోలీసుల ప్రతాపమా?*
పోలీసుల తీరు అత్యంత హేయంగా మారిందని తాటి వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస విచక్షణ మరిచి, మహిళా శాసనసభ్యులు అని కూడా చూడకుండా చీరలు పట్టుకుని ఈడ్చిపారేయడం పాలకుల దిగజారుడుతనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ఉమ్మడి రాష్ట్రంలో తొలి మహిళా హోంమంత్రిగా పనిచేసిన గౌరవనీయురాలైన సబితా ఇంద్రారెడ్డిని మహిళా పోలీసులు కాకుండా పురుష పోలీసులు అడ్డగించి అరెస్ట్ చేయడం ఏ రాజ్యాంగ సూత్రాల్లో భాగమని ప్రశ్నించారు. ఈ తోపులాటలో ప్రజాప్రతినిధులకు గాయాలు కావడం అత్యంత బాధాకరమని, అధికారం చేతిలో ఉందని విర్రవీగితే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.
*గొంతు నొక్కితే తిరుగుబాటు తప్పదు!*
ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నేరమా? ప్రజా సమస్యలను లేవనెత్తే ప్రతిపక్ష నాయకుల గొంతును ఖాకీల సాయంతో నొక్కేయడమే ప్రజాస్వామ్యమా? అని ప్రభుత్వాన్ని సూటిగా నిలదీశారు. నిరంకుశత్వంతో పాలించాలని చూసిన ఏ ప్రభుత్వమూ ప్రజా క్షేత్రంలో నిలబడలేదని తాటి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన అణచివేత ధోరణిని వీడాలని, ప్రతిపక్ష నేతలపై అక్రమ అరెస్టులు, దౌర్జన్యాలు తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజాక్షేత్రంలో ప్రజలే ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
