- District News
- Khammam
- హామీల మోసంపై రైతు కూలీల సమరభేరి
హామీల మోసంపై రైతు కూలీల సమరభేరి
28న ఖమ్మంలో భారీ బహిరంగ సభ.. ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి వై. ప్రకాష్ పిలుపు
కారేపల్లి (సింగరేణి), సెప్టెంబర్ 15 (లోకల్ గైడ్ న్యూస్) : రైతాంగానికి ఇచ్చిన హామీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నాయని ఏఐకేఎంఎస్ ఖమ్మం జిల్లా కార్యదర్శి వై. ప్రకాష్ విమర్శించారు. రైతులు, వ్యవసాయ కూలీల సమస్యలపై ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు ఈనెల 28న ఖమ్మం జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఏఐకేఎంఎస్ నాలుగో జాతీయ మహాసభల సందర్భంగా నిర్వహిస్తున్న ఈ సభకు రైతులు, వ్యవసాయ కూలీలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. 29, 30 తేదీల్లో ఖమ్మంలో జరిగే జాతీయ మహాసభలను కూడా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా కారేపల్లి మండలం పేరుపల్లి గ్రామంలో ప్రచారం నిర్వహించి వాల్పోస్టర్లను ఆవిష్కరించారు.ఎన్నికలకు ముందు పంటలకు స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, కనీస వేతన చట్టాన్ని అమలు చేస్తామని ప్రభుత్వాలు హామీ ఇచ్చాయని ప్రకాష్ గుర్తుచేశారు. ఢిల్లీ రైతాంగ ఉద్యమం సందర్భంగా తీసుకొచ్చిన మూడు నల్ల వ్యవసాయ చట్టాలను, నాలుగు లేబర్ కోడులను రద్దు చేస్తామని ప్రకటించినప్పటికీ, ఆ హామీల అమలులో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు.హామీల అమలు లేక రైతాంగం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, వ్యవసాయ రంగాన్ని కాపాడటంతో పాటు రైతు కూలీల హక్కుల పరిరక్షణ కోసం ఐక్య ఉద్యమాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం 28న ఖమ్మంలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేసి ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచాలని వై. ప్రకాష్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కంచర్ల శ్రీనివాస్రెడ్డి, అల్లం గురువయ్య, నాగేశ్వరరావు, కోటేశ్వరరావు, పద్మ, సుగుణ, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.
