మహబూబ్నగర్ ఆగస్టు 17 (లోకల్ గైడ్ ప్రతినిధి జీవి గౌడ్)
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు సమర్పించే ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల మేరకు సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు.సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి. హరిప్రియతో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. భూ సమస్యలు, రెవెన్యూ, పింఛన్లు, సంక్షేమ పథకాలు, ఉపాధి, రహదారులు, తాగునీరు, గృహ నిర్మాణం తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులను ప్రజలు సమర్పించారు. ప్రజావాణిలో 93 ఫిర్యాదులను అధికారులు స్వీకరించారు.ప్రతి ఫిర్యాదును సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి, సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి వినతికి ప్రాధాన్యతనిస్తూ, ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పరిష్కరించిన ఫిర్యాదుల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసి, సంబంధిత దరఖాస్తుదారులకు సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు.ప్రజావాణి ద్వారా ప్రజలు తమ సమస్యలను నేరుగా జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువస్తున్నందున, వాటి పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.