లోకల్ గైడ్/బంట్వారం:
జలసంచయ్ జన్ భాగీదారి ( జె ఎస్ జె బి 2.0) కార్యక్రమంలో భాగంగా మండలంలోని వివిధ గ్రామాల్లో చేపడుతున్న నీటి సంరక్షణ పనులను కేంద్ర బృందం బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు సదరన్ రీజియన్, హైదరాబాద్ సీనియర్ సైంటిస్ట్, జె ఎస్ జె బి 2.0 చీఫ్ నోడల్ ఆఫీసర్ డా. ఎస్.ఎస్. విట్టల నేతృత్వంలో అధికారులు నూరుల్లాపూర్, మద్వాపూర్, రొంపల్లి గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నీటి సంరక్షణ, వర్షపు నీటి నిల్వ, భూగర్భ జలాల పెంపుదల కోసం చేపట్టిన పనులను అధికారులు పరిశీలించారు. పనుల పురోగతి, నాణ్యత, వాటి ద్వారా కలుగుతున్న ప్రయోజనాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. వర్షపు నీటిని వృథాగా పోకుండా ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించేలా గ్రామస్థాయిలో మరిన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. నీటి సంరక్షణ పనులు భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని, పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు పేర్కొన్నారు. గ్రామాల్లో నీటి వనరులను పరిరక్షించడంతో పాటు వర్షపు నీటిని సమర్థవంతంగా వినియోగించుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా అడిషనల్ డీఆర్డీఓ ఎం. సత్తయ్య, ఎంపీడీఓ ఎ. రాములు, ఎంపీఓ నాగరాజు, కోఆర్డినేటర్ జె. సైదులు, ఏపీఓ సుధాకర్, ఈసీ శ్రీనివాస్, టెక్నికల్ అసిస్టెంట్లు, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉపాధిహామీ సిబ్బంది పాల్గొన్నారు.