- District News
- Nizamabad
- ఎస్సారెస్పీపై పర్యాటకుల సందడి
ఎస్సారెస్పీపై పర్యాటకుల సందడి
నిజామాబాదు జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్ ), ఆగష్టు 09:
వరుసగా మూడు రోజుల పాటు సెలవులు కలిసిరావడంతో పోచంపాడ్ ప్రాజెక్ట్ పై పర్యాటకుల సందడి నెలకొంది. జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి సైతం పర్యాటకులు ప్రాజెక్టుకు తరలివచ్చారు.
ఆదిలాబాద్, కరీంనగర్, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు కుటుంబ సమేతంగా భారీగా తరలివచ్చారు. డ్యామ్పై నుంచి వీస్తున్న చల్లని గాలులు, కళకళలాడుతున్న జలాశయ అందాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పర్యాటకులు డ్యామ్పై సేదతీరుతూ ప్రకృతి రమణీయతను తిలకించి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రాజెక్టు ప్రాంగణంలో అందుబాటులో ఉన్న గుర్రపు సవారీలు చిన్నారులను అమితంగా అలరించాయి.
సెలవుల కారణంగా భారీగా పర్యాటకులు తరలిరావడంతో ఎలాంటి ప్రమాదాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టింది. డ్యామ్ దిగువ భాగం, ప్రమాదకర ప్రాంతాల వైపు పర్యాటకులు వెళ్లకుండా మైకుల ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. నీటి ఉధృతి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోకి వెళ్లవద్దని అధికారులు పదేపదే సూచిస్తూ నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.
