- District News
- ప్రజా రక్షణే ధ్యేయం...
ప్రజా రక్షణే ధ్యేయం...
రోడ్డు మరమ్మతుల్లో పోలీసుల మానవత్వం..
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)
ప్రజల రక్షణ,భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తు విధులు నిర్వహిస్తున్న పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతలోను తమ వంతు పాత్ర పోషిస్తున్నారు.రహదారులపై ఏర్పడిన గుంతలు,దెబ్బతిన్న వంతెనలు,ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు.ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా మంచిర్యాల పరిధిలోని ఎసిసి క్వారీ మార్గంలోని రాళ్లవాగు వంతెన వద్ద రహదారి దెబ్బతిని కుంగిపోయింది.దీంతో ఆ మార్గంలో రాకపోకలు ప్రమాదకరంగా మారాయి.రహదారి పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నప్పటికీ కొందరు వాహనదారులు అదే మార్గంలో ప్రయాణిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.సమాచారం అందుకున్న మంచిర్యాల ట్రాఫిక్ సిఐ హన్నన్ తన సిబ్బందితో కలిసి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా తాత్కాలిక మరమ్మతులు చేపట్టడంతో పాటు,క్వారీ వైపు వెళ్లే మార్గాన్ని మూసివేయించారు.ప్రమాదకర
ప్రాంతంలోకి వాహనదారులు ప్రవేశించకుండా అవసరమైన భద్రతా చర్యలు చేపట్టారు.ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతు ప్రజలు దెబ్బతిన్న రహదారుల పరిస్థితిని గమనించి ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని సూచించారు.ముఖ్యంగా వర్షాకాలంలో,రాత్రి వేళల్లో రహదారులపై ప్రయాణించే సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు.ప్రజల ప్రాణాలను కాపాడటం,ప్రమాదాలను ముందుగానే నివారించడం పోలీసుల ప్రధాన బాధ్యతల్లో ఒకటని,శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజల భద్రత కోసం అవసరమైన ప్రతి సందర్భంలో పోలీసులు తక్షణమే స్పందిస్తారని అధికారులు తెలిపారు.ప్రమాదం సంభవించే అవకాశం ఉన్న ప్రాంతాన్ని గుర్తించి పోలీసులు సకాలంలో స్పందించి తీసుకున్న చర్యలపై స్థానికులు,వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు.ప్రజల భద్రత పట్ల పోలీసులు చూపుతున్న సామాజిక బాధ్యతను అభినందించారు.
