- District News
- Ranga Reddy
- వీరనాగమ్మ ఆలయ అభివృద్ధికి రూ.1.80 లక్షల సహకారం
వీరనాగమ్మ ఆలయ అభివృద్ధికి రూ.1.80 లక్షల సహకారం
దొడ్లపహాడ్లో మండల పూజా కార్యక్రమంలో పాల్గొన్న సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి
న్యూస్ స్టార్
లోకల్ గైడ్ – ఆమనగల్లు, ఆగస్టు 10:
మాడుగుల మండలం దొడ్లపహాడ్ గ్రామంలో నూతనంగా విగ్రహ ప్రతిష్ఠాపన పూర్తిచేసుకున్న వీరనాగమ్మ దేవత ఆలయంలో 41 రోజుల పూజా కార్యక్రమాల ముగింపు సందర్భంగా నిర్వహించిన మండల పూజా కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, టాస్క్ సి ఓ ఓ సుంకి రెడ్డి రాఘవేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఆలయ అభివృద్ధికి అండగా..
గ్రామ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తున్న వీరనాగమ్మ దేవత ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారంగా రూ.1,80,000లతో పెయింటింగ్ పనులు పూర్తి చేయించారు. ఆలయ అభివృద్ధికి సహకరించిన రాఘవేందర్ రెడ్డికి గ్రామస్థులు, ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల్లోని ఆలయాలు ప్రజల విశ్వాసాలు, సంప్రదాయాలు, సంస్కృతిని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ఆలయాల అభివృద్ధి కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలకే పరిమితం కాకుండా గ్రామ ప్రజలందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఐక్యతను పెంపొందించే కేంద్రాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు.
వీరనాగమ్మ దేవత ఆలయంలో నిర్వహించిన మండల పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. దొడ్లపహాడ్ గ్రామ ప్రజలపై వీరనాగమ్మ దేవత అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మట్ట నాగయ్య, మట్ట యాదయ్య, అర్జున్, మల్లేష్, శ్రీను, శంకర్, రాజు, నాగరాజు, వెంకటేష్, సురేష్, సత్తయ్య, యాదగిరి, నాగేష్ తదితర ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఆలయ అభివృద్ధికి రూ.1.80 లక్షలతో పెయింటింగ్ పనులు పూర్తి చేసి సహకరించిన రాఘవేందర్ రెడ్డికి గ్రామస్థులు, ఆలయ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.
