- District News
- Ranga Reddy
- ఆమనగల్లు ను హరితవనంగా తీర్చిదిద్దుతాం.. ఘనంగా వనమహోత్సవం
ఆమనగల్లు ను హరితవనంగా తీర్చిదిద్దుతాం.. ఘనంగా వనమహోత్సవం
పచ్చదనం పెంపే లక్ష్యం.. ఆమనగల్లు లో మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు, అధికారులు
లోకల్ గైడ్ ఆమనగల్లు, ఆగస్టు 25:
వనమహోత్సవాన్ని పురస్కరించుకుని ఆమనగల్లు పట్టణంలో పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆమనగల్లు పురపాలక సంఘం, అటవీశాఖ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో పట్టణంలోని పలు ప్రాంతాల్లో మొక్కలు నాటారు.
ఆమనగల్లు–జంగారెడ్డిపల్లి ప్రధాన రహదారికి ఇరువైపులా, అలాగే ఆమనగల్లు పోలీస్స్టేషన్ ప్రాంగణంలో పెద్ద సంఖ్యలో మొక్కలను నాటారు. పట్టణంలో పచ్చదనం విస్తరించడంతో పాటు భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటి సంరక్షణ బాధ్యతను చేపట్టాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆమనగల్లు మున్సిపల్ చైర్మన్ ఎన్. పత్య నాయక్, వైస్ చైర్పర్సన్ టి. గీతా ఆచారి, మున్సిపల్ కమిషనర్ ఎస్. రాఘవేందర్ రెడ్డి, ఆమనగల్లు ఎస్హెచ్ఓ వెంకటేశ్వర్లు, అటవీశాఖ డిప్యూటీ రేంజ్ అధికారి జగన్ మోహన్ ముఖ్య అతిథులుగా పాల్గొని మొక్కలు నాటారు.
అలాగే సబ్ ఇన్స్పెక్టర్ సంతోష్ రెడ్డి, కౌన్సిలర్లు ఆంజనేయులు, సునీత ప్రశాంత్, ధోలి, పాపిశెట్టి రామకృష్ణ, ఎ. రమేష్, ఎం. వెంకటయ్య, మున్సిపల్ మేనేజర్ ఆంజనేయులు, మున్సిపల్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొని వనమహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
మొక్క నాటడం మాత్రమే కాదు.. దానిని సంరక్షించడం కూడా ప్రతి ఒక్కరి బాధ్యత అని అధికారులు పేర్కొన్నారు. పట్టణాన్ని పచ్చదనంతో నింపేందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
