- District News
- Ranga Reddy
- ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ –
ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ –
మలబార్ గ్రూప్ ఉద్యోగులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన.
రంగారెడ్డి జిల్లా బ్యూరో, ( లోకల్ గైడ్ ):
ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని ఫుచర్ సిటీ ట్రాఫిక్ డీసీపీ శివం ఉపాధ్యాయ్ సూచించారు. ట్రాఫిక్ నిబంధనలపై ఉద్యోగుల్లో అవగాహన పెంపొందించే ఉద్దేశంతో మహేశ్వరం పరిధిలోని మలబార్ గ్రూప్ సంస్థలో మహేశ్వరం ట్రాఫిక్ ఏసీపీ ఏ. చంద్ర శేఖర్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
డీసీపీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, నిబంధనలు పాటించని వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు నిబంధనలు ఉల్లంగించిన వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే వాహనాలు నడిపేవారితో ఇతరులకు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయన్నారు. ఉద్యోగులకు రహదారి భద్రతకు సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ సంకేతాలను తప్పనిసరిగా పాటించడం, రహదారి దాటేటప్పుడు జీబ్రా క్రాసింగ్లను వినియోగించడం, రహదారిపై ఎడమ వైపున నడవడం, చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్తో పాటు వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలను కలిగి ఉండటం తప్పనిసరి అని సూచించారు.
అలాగే, ముగ్గురు వ్యక్తులు ఒకే ద్విచక్ర వాహనంపై ప్రయాణించడం, అతివేగం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, రాంగ్ రూట్లో ప్రయాణించడం, మద్యం సేవించి వాహనం నడపడం, మైనర్లతో వాహనాలు నడిపించడం వల్ల కలిగే ప్రమాదాలు, చట్టపరమైన పరిణామాలపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ ఏసీపీ ఏ. చంద్ర శేఖర్ మాట్లాడుతూ
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, దాని పట్టీని సక్రమంగా బిగించుకోవాలని తెలిపారు. కార్లలో ప్రయాణించే సమయంలో సీటు బెల్ట్ ధరించాలని సూచించారు. నిషేధిత పార్కింగ్ ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై వాహనాలను నిలుపరాదన్నారు. ట్రాఫిక్ నిబంధనల ప్రకారం ఎడమ వైపు ఉచిత మార్గాన్ని వాహనాల రాకపోకలకు ఖాళీగా ఉంచాలని సూచించారు.
బస్సుల్లో ప్రయాణించే సమయంలో సురక్షితంగా ఎక్కడం, దిగడం వంటి జాగ్రత్తలను పాటించాలని, ముందున్న రహదారి పూర్తిగా స్పష్టంగా ఉండి, సురక్షితంగా అధిగమించేందుకు తగినంత దూరం ఉన్నప్పుడు మాత్రమే ఇతర వాహనాలను అధిగమించాలని వివరించారు.
ఈ సందర్భంగా *ఉద్యోగులతో ట్రాఫిక్ నిబంధనలను తాము తప్పనిసరిగా పాటించడంతో పాటు, తమ కుటుంబ సభ్యులు కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా ప్రోత్సహిస్తామని ప్రతిజ్ఞ చేయించారు.
అలాగే రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన ప్రత్యక్ష వీడియోలు, రహదారి భద్రతా సూచికలను ప్రదర్శించి వాటి ప్రాధాన్యతను వివరించారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలను ఉదాహరణగా తీసుకుని ప్రమాదాల వల్ల సంభవించే ప్రాణనష్టం, బాధిత కుటుంబాలు ఎదుర్కొనే విషాద పరిస్థితులు, వారి జీవితాలపై పడే తీవ్ర ప్రభావాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది సిబ్బంది పాల్గొన్నారు.
