- District News
- తాగునీటి కోసం రోడ్డెక్కిన తండా ప్రజలు.
తాగునీటి కోసం రోడ్డెక్కిన తండా ప్రజలు.
గత 15 రోజులుగా తాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు. పలుమార్లు సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆరోపణ
లోకల్ గైడ్/తాండూర్:
వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల పరిధిలోని కందనెల్లి తండాలో గత 15 రోజులుగా తాగునీరు సరఫరా కాకపోవడంతో తండావాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఉదయం తండా ప్రజలు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలు.. ‘సర్పంచ్ డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేస్తూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. గత 15 రోజులుగా తాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు. నీటి సమస్యను పలుమార్లు సర్పంచ్ ఆనంద్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు.
తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని తండావాసులు కోరారు. అదేవిధంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వెంటనే స్పందించి తమ తాగునీటి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
