- District News
- Ranga Reddy
- దళిత రైతుల ఆగ్రహం ఉవ్వెత్తున.. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి – లేదంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం
దళిత రైతుల ఆగ్రహం ఉవ్వెత్తున.. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి – లేదంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం
50 మంది బాధిత రైతుల తరఫున అధికారులకు విజ్ఞప్తి
-శంకర్ పల్లి, ( లోకల్ గైడ్ ): రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం పొద్దటూర్ గ్రామానికి చెందిన దళిత రైతుల భూ పోరాటం మరోసారి ఉధృతమైంది. ఏళ్లుగా న్యాయం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా తమకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేసిన బాధితులు,ఇక మౌనం వహించే పరిస్థితి లేదని హెచ్చరించారు. బాధితులు శంకర్ పల్లి తహసీల్దార్ సురేందర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తమను మోసం చేశారని ఆరోపిస్తూ బలం రెడ్డి శ్రీనివాస్, వై.వి. విక్రాంత్ రెడ్డిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోని అరెస్ట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళితుల భూముల విషయంలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు,అధికార అండలు పనిచేయకుండా పారదర్శక విచారణ జరగాలని కోరారు.
పన్నాలాల్కు సంబంధించిన సుమారు 200 ఎకరాల భూమిపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి అసలు వాస్తవాలను ప్రజల ముందుంచాలని వారు డిమాండ్ చేశారు.ఈ వ్యవహారంలో ఎవరైనా ఎంతటి ప్రభావశీలులైనా చట్టం ముందు సమానమేనని పేర్కొన్నారు.తాము జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ)కు ఫిర్యాదు చేసినప్పటికీ, పూర్తి స్థాయి విచారణ లేకుండానే నివేదిక సమర్పించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విచారణ జరపకుండానే నివేదిక ఎలా ఇచ్చారో ప్రభుత్వం,సంబంధిత అధికారులు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
అలాగే,సర్వే నంబర్లు 240, 241, 249కు ఓ ఆర్ సి లు జారీ చేసిన ప్రక్రియపై స్వతంత్ర సీబీఐ విచారణ జరిపించి,అక్రమాలు జరిగి ఉంటే బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.దళితులకు న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు. అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని విస్తరిస్తాం.త్వరలో హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద భారీ ధర్నా నిర్వహించి ప్రభుత్వాన్ని నిలదీస్తాం అని బాధితులు స్పష్టం చేశారు.దళిత రైతుల భూముల పరిరక్షణకు ప్రభుత్వం వెంటనే స్పందించి నిష్పాక్షిక విచారణ జరిపి న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
టీఆర్ఎస్ అధ్యక్షులు కొల్లూరి శ్రీనివాస్ రావు, సంబంధిత అధికారులను కోరుతూ.. అక్రమ ఆక్రమణలు, మోసాలపై సమగ్ర విచారణ చేపట్టాలని, జి.ఓ.111 ఉల్లంఘిస్తూ నిర్మించిన గ్రానైట్ ప్రహరీ గోడలు, కమర్షియల్ షెడ్లు, ఇతర నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని, రైతుల భూములను తిరిగి అప్పగించాలని, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఎస్సీ రైతులకు న్యాయం చేసి వారి రాజ్యాంగ హక్కులను పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఫిర్యాదు ప్రతులను రాష్ట్ర ప్రభుత్వం,హెచ్ఎండీఏ, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ, జిల్లా కలెక్టర్, హైడ్రా, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, జాతీయ ఎస్సీ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖతో సహా మొత్తం 25 ప్రభుత్వ విభాగాలు, సంస్థలకు పంపినట్లు ఆయన తెలిపారు..
