సిద్దిపేట ఆగస్ట్ 10 (లోకల్ గైడ్):
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మోటార్లను వెంటనే ఆన్ చేసి రిజర్వాయర్లను నింపాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రాజకీయాలకు అతీతంగా నీటి పంపింగ్ ప్రారంభించాలని ఆయన లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.ప్రస్తుత వానాకాలం సాగు సీజన్లో ఒకవైపు ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనగా, మరోవైపు ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో నీటిని సకాలంలో నింపకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని హరీష్ రావు పేర్కొన్నారు. పంటల సాగు ముందుకు సాగేందుకు సాగునీటి కోసం రైతాంగం ఎదురుచూస్తోందన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మిడ్ మానేరు నుంచి మోటార్లను ఆన్ చేసి నీటిని పంపింగ్ చేయడం ద్వారా అన్నపూర్ణ (అంతగిరి), రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, నృసింహ (బస్వాపూర్) తదితర రిజర్వాయర్లను నింపాలని కోరారు. వాటి పరిధిలోని చెరువులు, చెక్డ్యామ్లను కూడా నింపి సుమారు 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.మిడ్ మానేరు రిజర్వాయర్ పూర్తి నీటి సామర్థ్యం 27 టీఎంసీలు కాగా, ప్రస్తుతం సుమారు 22 టీఎంసీల నీటి లభ్యత ఉందని హరీష్ రావు తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరిలో వరద నీటి లభ్యత కూడా ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న నీటిని సద్వినియోగం చేసుకుని ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టి రిజర్వాయర్లకు పంపింగ్ చేయాలని కోరారు.అదేవిధంగా లోయర్ మానేరు డ్యామ్ (ఎల్ఎండీ) పూర్తి సామర్థ్యం 24 టీఎంసీలు కాగా, ప్రస్తుతం సుమారు 6.9 టీఎంసీల నీరు మాత్రమే ఉందని తెలిపారు. మిడ్ మానేరు నుంచి ఎల్ఎండీకి నీటిని తరలించి ఎస్ఆర్ఎస్పీ స్టేజ్-2 పరిధిలోని ఆయకట్టుకు సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.గత యాసంగి సీజన్లో కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని ఎగువ రిజర్వాయర్ల ఆయకట్టు కింద సుమారు 4 లక్షల ఎకరాల్లో సాగు జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ వానాకాలంతో పాటు వచ్చే యాసంగి పంటకు కూడా సాగునీరు అందేలా అన్ని రిజర్వాయర్లు, కాలువలు, చెరువులు, చెక్డ్యామ్లను నింపేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.రైతుల్లో నెలకొన్న ఆందోళనను తొలగించేందుకు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి నీటి పంపింగ్ ప్రారంభించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.