ప్రముఖ దర్శకులు మారుతి చేతుల మీదుగా ఇషాన్ క్రియేషన్స్ నిర్మించిన 'యోగా ఆంథెమ్' సాంగ్ రిలీజ్
మెలొడీ బ్రహ్మ మణిశర్మ కంపోజిషన్ లో అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించగా ఇషాన్ క్రియేషన్స్ సంస్థ నిర్మించిన యోగా ఆంథెమ్ సాంగ్ ను ప్రముఖ దర్శకులు మారుతి రిలీజ్ చేశారు. హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఇషాన్ క్రియేషన్స్ అధినేత అశోక్, దర్శకులు మారుతి, లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా
లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ మాట్లాడుతూ - మనసు బాగుంటే శరీరం బాగుంటుంది. అలా మనసు, శరీరాన్ని కలిపే శక్తి యోగాకు ఉంది. ఏ పేటెంట్ లేకుండా మనం ప్రపంచానికి అందించిన బహుమతి యోగా. ఈ పాటను అన్ని భాషల వారికీ అర్థమయ్యేలా రాయాలని అనుకున్నాను. అందుకే ఎక్కువగా సంస్కృత పదాలు ఉపయోగించి రాశాను. సంస్కృతాన్ని దైవ భాష అని అంటారు. ఈ పాట రూపకల్పన చేసి నాతో పాట రాయించాలని అశోక్ గారు అనుకున్నందుకు థ్యాంక్స్. యోగాకు ప్రచారం కల్పిస్తూ దానికి ఒక ప్రత్యేకమైన రోజును ఇంటర్నేషనల్ యోగా డేగా గుర్తించడం లోక కల్యాణానికి మంచిది. యోగాకు ప్రాధాన్యత ఇస్తున్న మన నాయకులు అందరికీ ధన్యవాదాలు. అన్నారు.
ఇషాన్ క్రియేషన్స్ అధినేత అశోక్ మాట్లాడుతూ - నేను తెలుగు చిత్ర పరిశ్రమలో డిస్ట్రిబ్యూటర్ గా పలు సక్సెస్ ఫుల్ మూవీస్ డిస్ట్రిబ్యూట్ చేశాను. అప్పటి నుంచే మారుతి గారి సపోర్ట్ ఉండేది. ఆ తర్వాత శంకరాభరణం, కళావతి అనే మూవీస్ పంపిణీ చేసి నష్టపోయాను. ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోదామనుకునే టైమ్ లో మారుతి గారు పిలిచి నీకు మంచి రోజులు వస్తాయి. వెయిట్ చేయి అన్నారు. నాకు చిన్నప్పటి నుంచి యోగా చేయడం అలవాటు ఉండేది. డిస్ట్రిబ్యూషన్ ఆపేశాక ఏడాదిపాటు రోజుకు 18 గంటలు యోగా ప్రాక్టీస్ చేశాను. 17 శక్తి పీఠాలు, 12 జ్యోతిర్లింగాలు దర్శించాను. ఆ తర్వాత సెలూన్, రియల్ ఎస్టేట్ బిజినెస్ లు పెట్టాను. ఇంటర్నేషనల్ యోగా డే పెట్టి 11 ఏళ్లవుతోంది. ఈసారి యోగాంధ్ర సెలబ్రేషన్స్ లో మా యోగా ఆంథెమ్ సాంగ్ కు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఈపాటను మణిశర్మ గారు అద్భుతంగా కంపోజ్ చేశారు, అనంత శ్రీరామ్ గారు అందమైన లిరిక్స్ ఇచ్చారు. అనురాగ్ కులకర్ణి గారు ఆకట్టుకునేలా పాడారు. ఈ పాటకు నాకు ఏపీ ప్రభుత్వం లక్ష రూపాయల నగదు బహుమతి, ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. రేపు మోదీ గారిని కలిసే 50 మందిలో నాకు మొదటి అవకాశం కల్పించారు. అన్నారు.