స్వంత ఇంటి కలను సాకారం చేసుకోవాలి

స్వంత ఇంటి కలను సాకారం చేసుకోవాలి

జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్.

గద్వాల, లోకల్ గైడ్ :
ఇందిరమ్మ పథకం ద్వారా ఇంటి మంజూరు పొందిన లబ్ధిదారులు నెల రోజుల్లో నిర్మాణం ప్రారంభించి, ఏడాది లోపు పూర్తి  చేసుకొని స్వంత ఇంటి కలను సాకారం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ సూచించారు. గురువారం మల్దకల్ మండల కేంద్రంలోని ఇందిరమ్మ ఇండ్లు మంజూరు ఉత్తర్వులు పంపిణీ కార్యక్రమంలో గద్వాల శాసన సభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డితో కలిసి లబ్ధిదారులకు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అనంతరం ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఆరు గ్యారెంటీ పథకాలకు దరఖాస్తులు స్వీకరించబడినట్లు అధికారులు తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా నుంచి వచ్చిన 1.5 లక్షల దరఖాస్తుల్లో, ప్రతి దానిని నిర్ధిష్టంగా వెరిఫై చేసి అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందజేయడం జరుగుతోందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూర య్యాయని, గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయివరకు పూర్తిగా వెరిఫికేషన్ చేసి, ఇల్లు లేని పేద కుటుంబాలను గుర్తించి, అర్హులైన వారికి ఈ రోజు మల్దకల్ మండలంలో 480 మంజూరు పత్రాలు అందజేయడమైందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు విడతలవారీగా నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయనుందని, ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా స్టేజ్ వారిగా నిధులు అందుతాయని  తెలిపారు. తక్కువ ఖర్చుతో నిర్మాణ విధానంపై పూర్తి అవగాహనను హౌసింగ్ అధికారులు అందించ నున్నారని, డబ్బులు ఎవరికీ ఇవ్వనవసరం లేదని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం తక్షణమే ప్రారంభించి ఒక సంవత్సరంలోపు పూర్తి చేసుకోవాలని అన్నారు. రైతుల పంటల కోసం అవసరమైన విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. జిల్లా రైతు భరోసా కేంద్రానికి రూ.250 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గద్వాల శాసన సభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లా అభివృద్ధి కోసం నిరంతరం ప్రత్యేక కృషి చేస్తున్నామని, ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. గతంలో సాగు, త్రాగునీరు లేక కష్టాలు పడిన ప్రజలు, ఇప్పుడు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గద్వాల నియోజకవర్గానికి మంజూరు చేసిన 3500 ఇందిరమ్మ ఇళ్లలో 480 ఇళ్లు మల్దకల్ మండలానికే కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో అధికారులు నిబద్ధతతో పనిచేస్తుండటంతో లబ్ధిదారులు తక్షణమే ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించాలని కోరారు. ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమవు తున్నాయని, అధికారులే ప్రత్యక్షంగా వచ్చి సూచనలు అందిస్తరాని తెలిపారు. ప్రతి పేదవారి సొంతింటి కలను ఇందిరమ్మ ప్రభుత్వం నెరవేరుస్తుందని తెలిపారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఆంజనేయరెడ్డి, స్పెషల్ ఆఫీసర్ సంగీత లక్ష్మి, మాజీ ఎంపీపీ రాజారెడ్డి, పటేల్ ప్రభాకర్ రెడ్డి, సత్యారెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు, ప్రజలు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News