పీవీ 104వ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ఘన నివాళి
లోకల్ గైడ్,అమరావతి: భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 104వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఘన నివాళి అర్పించారు. “దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఆర్థిక సంస్కరణల ద్వారా దేశ దిశను మార్చిన పీవీ ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తారు” అని చంద్రబాబు పేర్కొన్నారు.
“తొలి తెలుగు ప్రధానిగా, ఆర్థిక సంస్కరణల రూపకర్తగా పీవీ కీర్తి గడించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన పీవీ గారి సేవలను ఈ సందర్భంగా స్మరించుకుందాం” అని అన్నారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా పీవీని గుర్తుచేసుకుంటూ,
“పీవీ.. తెలుగు ఠీవీకి ప్రతిరూపం. నిరాడంబర జీవనానికి నిలువెత్తు నిదర్శనం. సొంత భూములు పంచి పెట్టి భూ సంస్కరణలు తీసుకొచ్చిన మహనీయుడు. దేశ ఆర్థిక ప్రగతికి పునాది వేసిన రాజనీతిజ్ఞుడు. కాని కాంగ్రెస్, భారాస పార్టీలు పీవీని విస్మరించాయి. ఎన్నికలప్పుడు మాత్రమే ఆయన పేరును వాడుకుని తర్వాత మరచిపోయాయి. పీవీ విజ్ఞాన వేదికను ఇప్పటికీ ఏర్పాటు చేయకపోవడం శోచనీయం” అని వ్యాఖ్యానించారు.