డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి పౌరుడు  కృషి చేయాలి

డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి పౌరుడు  కృషి చేయాలి

- జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్.

గద్వాల, లోకల్ గైడ్:
జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి పౌరుడు బాధ్యతగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అన్నారు. గురువారం మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా అంతర్జాతీయ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా, జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గద్వాల కృష్ణవేణి చౌరస్తా నుండి మాదకద్రవ్య రహిత జిల్లా లక్ష్యంగా నిర్వహించిన అవగాహన ర్యాలీని ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ ప్రారంభించారు. డ్రగ్స్ అవగాహన ర్యాలీని పాత బస్టాండ్ వరకు  నిర్వహించిన అనంతరం జిల్లా కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ, సమాజంపై మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలలో అవగాహన పెంపొందించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ముఖ్యంగా డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలను విద్యార్థులు గుర్తించి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా  ఉండాలన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నిరోధక కమిటీలను బలోపేతం చేయాలని సూచించారు. మత్తుపదార్థాలు అమ్మే వారి గురించి సమాచారం అందించడం పౌరుల బాధ్యతగా పేర్కొన్నారు.
డ్రగ్స్ బారిన పడిన యువతకు  జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తున్నామని తెలిపారు. 17-18 ఏళ్లలోపు యువత డ్రగ్స్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉన్నందున, ఈ దశలో వారికి సరైన మార్గదర్శకం చేయాల్సిన  అవసరం ఉందని తెలిపారు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి, శారీరకంగా, మానసికంగా బలంగా ఉండాలని సూచించారు.మత్తు పానీయాలు, సిగరెట్లు, గుట్కాలు, గంజాయి వంటివి యువత ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయని అన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు యువత ముందుకు వచ్చి సమాజానికి తోడ్పడాలని అన్నారు. జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు మాట్లాడుతూ, మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా కఠినమైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. జిల్లా స్థాయిలో కూడా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చర్యలు వేగవంతంగా కొనసాగు తున్నాయన్నారు. డ్రగ్స్‌ వల్ల యువత భవిష్యత్తు నాశనమవుతుందని, అందువల్ల అందరూ బాధ్యతతో ముందుకి వచ్చి, ప్రజలకు ప్రాణాంతకంగా పరిణమించే మాదకద్రవ్యాల నివారణలో ప్రతి ఒక్కరు భాగస్వాములవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారిని సునంద, డి.యం.హెచ్.ఓ సిద్ధప్ప, డి.ఎస్.పి. మొగులయ్య ఎక్సైజ్, పోలీస్, జిల్లా సంక్షేమ శాఖ, వివిధ శాఖల అధికారులు, వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, యువత, స్థానిక ప్రజా ప్రతినిధులు  తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News